BSNL 5G నెట్వర్క్తో వీడియో కాల్ చేసిన కేంద్ర మంత్రి సింధియా.. వీడియో వైరల్..!
గత నెలలో ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా భారీగా మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచాయి. దీంతో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చింది. తక్కువ ధరకే సర్వీసులు అందుబాటులో ఉండడం సహా త్వరలో 4G నెట్వర్క్ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తారనే వార్తలతో అనేక మంది BSNL వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా BSNL కు (BSNL 5G Video Call) పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసింది.
ఇప్పటికే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో BSNL 4G సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేశారు. ఇందుకు ప్రముఖ టెక్ దిగ్గజం టాటాతో బీఎస్ఎన్ఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా 4G సేవలు సహా కొన్ని నెలల్లోనే 5G నెట్వర్క్కు కూడా సులభంగా అప్గ్రేడ్ అయ్యేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే తాజాగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దేశంలో BSNL 4G సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా.. తాజాగా ఆ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా టెస్టింగ్లో ఉన్న BSNL 5G నెట్వర్క్ను పరీక్షించారు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-Dot) కార్యాలయం నుంచి BSNL 5G ద్వారా వీడియో కాల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను మంత్రి X ద్వారా షేర్ చేశారు.
ఈ వీడియోలో మంత్రి ఓ మహిళతో మాట్లాడారు. తాను కనిపిస్తున్నానా మరియు తన మాటలు వినిపిస్తున్నాయా అని ప్రశ్నించడాన్ని వీడియోలో గమనించవచ్చు. ఈ ప్రశ్నలకు సదరు మహిళ కూడా సమాధానం చెప్పారు. మాటలు స్పష్టంగా ఉన్నాయని చెప్పడం వీడియోలో గమనించవచ్చు. అనంతరం మంత్రి పక్కన ఉన్న అధికారి BSNL 5G అంటూ మాట్లాడడం వినిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
*ఇటీవల ఇతర నెట్వర్క్ల నుంచి BSNL కు పోర్టింగ్ అయ్యే వినియోగదారుల సంస్థ గణనీయంగా పెరుగుతోంది. BSNL ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 30 రోజుల్లో 2 లక్షలకు పైగా కొత్త సిమ్ కార్డులు యాక్టివేట్ అయినట్లు వెల్లడించించింది. దేశవ్యాప్తంగా ఇతర సర్కిళ్లలోనూ వినియోగదారుల సంఖ్య పెరుగుతోందని తెలుస్తోంది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో టెలికాం శాఖకు సంబంధించిన ప్రాజెక్టులు సహా ఇతర సంస్థల కోసం రూ.1.28 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో BSNL టెక్నాలజీ అప్గ్రేడ్ మరియు పునర్నిర్మాణం కోసం రూ.82.916 కోట్లు కేటాయించారు. దీంతోపాటు కేంద్రం ప్రకటించిన రిలీఫ్ ప్యాకేజీ ద్వారా BSNL కోసం స్పెక్ట్రమ్ రిజర్వ్ చేయబడింది. వినియోగదారుల ఆసక్తి, కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలతో బీఎస్ఎన్ఎల్కు పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది.

కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జోతిరాదిత్య సింధియా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. 4G సర్వీసులను రోజువారీ పర్యవేక్షణకు ప్రత్యేక యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 4G నెట్ వర్క్ ప్రారంభం అనంతరం రోజువారీ లక్ష్యాలను నిత్యం పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications








