దేశంలో 5G కనెక్టివిటీపై పార్లమెంట్లో కేంద్ర మంత్రి కీలక ప్రకటన.. పూర్తి వివరాలు..!
భారత్ టెలికాం రంగం క్రమంగా అభివృద్ధి చెందుతోంది. వినియోగదారులకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా 5G నెట్వర్క్ ను ఇప్పటికే జియో, ఎయిర్టెల్ వంటి సంస్థలు 5G నెట్వర్క్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. దేశవ్యాప్తంగా మరిన్ని ప్రాంతాలకు క్రమంగా విస్తరిస్తున్నాయి. మరో ప్రముఖ టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా (Vi) ఇటీవలే ముంబైలో 5G ట్రయల్స్ నిర్వహించింది.
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఈ సంవత్సరం మధ్య నాటికి దేశవ్యాప్తంగా 4G నెట్వర్క్ ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు 5G ట్రయల్స్ను కూడా ఇప్పటికే నిర్వహించింది. ఈ సంవత్సరం లోనే 5G నెట్వర్క్ను లాంచ్ చేస్తామని గతంలో ఆ శాఖ మంత్రి జోతిరాధిత్య సింధియా వెల్లడించారు.

కీలక ప్రకటన :
అయితే దేశంలో 5G నెట్వర్క్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పార్లమెంట్ వేదికగా దేశంలో 5G నెట్వర్క్ కనెక్టివిటీ వివరాలను ఆ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 776 జిల్లాలకు గాను 773 జిల్లా్లలో 5G నెట్వర్క్ అందుబాటులో ఉందని తెలిపారు.
మరియు ఫిబ్రవరి 28 నాటికి దేశవ్యాప్తంగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు 4.69 లక్షల 5G బేస్ ట్రాన్స్సీవర్ స్టేషన్లను ఏర్పాటు చేశాయని తెలిపారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చారు.
దేశంలో ఇప్పటికే అత్యధిక ప్రాంతాల్లో జియో, ఎయిర్టెల్ 5G నెట్వర్క్ ను కలిగి ఉంది. దేశంలో మూడో అతిపెద్ద టెలికాం నెట్వర్క్ గా ఉన్న వోడాఫోన్ ఐడియా (Vi) ఉంది. ఇటీవలే ముంబైలోని ఎంపిక చేసిన యూజర్లపై 5G ట్రయల్స్ నిర్వహించింది. ట్రయల్స్ అనంతరం ముంబైలోనే తొలుత ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
అనంతరం ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, అహ్మదాబాద్, చెన్నై వంటి నగరాలు సహా టైర్ 2, టైర్ 3 ప్రాంతాల్లోనూ తర్వాత దశలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. జియో. ఎయిర్టెల్ తో పోలిస్తే 5G రీఛార్జ్ ధరలు తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) 4G నెట్వర్క్ ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా లక్ష 4G టవర్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే 75000 టవర్లు యాక్టివ్ గా ఉన్నాయని తెలుస్తోంది.
4G నెట్వర్క్తోపాటు గత సంవత్సరంలోనే 5G నెట్వర్క్ ట్రయల్స్ కూడా నిర్వహించారు. ఈ సంవత్సరం జూన్ లో ప్రారంభించే అవకాశం ఉందని గతంలోనే మంత్రి జోతిరాధిత్య సింధియా తెలిపారు. అయితే తొలి దశలో ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే BSNL 5G అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇటీవలే జియో. ఎయిర్టెల్ సంస్థలు శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఫలితంగా మారుమూల ప్రాంతాలకు కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించవచ్చు. అయితే స్పేస్ఎక్స్ సంస్థకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








