ట్రంప్ని హెచ్చరించిన అమెరికా కంపెనీలు, చైనా దెబ్బేనా !
గత కొద్ది కాలం నుంచి అమెరికాకు చైనాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం అందరికీ తెలిసిందే. రెండు దేశాల మధ్య వాణిస్య పోరు పతాక స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా ఉత్పత్తులన్నింటిపైనా టారిఫ్లను 25 శాతానికి పెంచేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు.

అయితే ఈ ఈ విషయంలో ఒక్క అడుగు ముందుకు వేసినా పరోక్షంగా అమెరికా కంపెనీలు, వినియోగదారులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అక్కడి కంపెనీలు ట్రంప్ ని హెచ్చరించాయి. చైనా నుంచి దిగుమతయ్యే 250 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే టారిఫ్లను పెంచేసింది. ఓ ఒప్పందానికి రాకపోతే మిగిలిన 300 బిలియన్ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై కూడా టారిఫ్లను 25 శాతానికి పెంచేస్తామన్నది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక.

సంబరాలు రద్దు చేసుకోవాల్సిందే
ఇలా చేస్తే బాణసంచా ధరలు పెంచాల్సి వస్తుందని, తద్వారా వ్యాపారాన్ని కోల్పోవాల్సి వస్తుందని న్యూ హాంప్షైర్ ఫైర్వర్క్స్ అనే కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల అమెరికాలోని చిన్న పట్టణాల్లో జూలై 4 నాటి స్వాతంత్య దినోత్సవ సందర్భంగా బాణసంచా సంబరాలను రద్దు చేసుకోవాల్సి వస్తుందని ఈ కంపెనీ హెచ్చరించింది. ఇక మిన్నెసోటాకు చెందిన ఓ మోటార్సైకిల్ కంపెనీ కూడా చైనా విడిభాగాలపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేని ప్రత్యర్థి కంపెనీలు తమ వ్యాపారాన్ని ఎత్తుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. లాస్ ఏంజెలిస్కు చెందిన గృహోపకరణాల డిజైనర్, పంపిణీ కంపెనీ అయితే, ఉద్యోగ నియామకాలను నిలిపేయాల్సి వస్తుందని, అలాగే, గిడ్డంగుల భారీ విస్తరణ ప్రణాళికలు కూడా ఆలస్యం అవుతాయని పేర్కొంది.

పెంచితే పోటీలో నిలవలేం
చైనా నుంచి అమెరికాకు వచ్చే ప్రతి ఉత్పత్తిపైనా 25 శాతం టారిఫ్లు విధించే ప్రతిపాదనపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అభిప్రాయాలను కోరగా... టారిఫ్లను పెంచే విషయంలో ముందుకు వెళ్లకపోవటమే మంచిదన్న సూచనలు ఎక్కువగా వస్తున్నాయి. సోమవారం నుంచి ఏడు రోజుల పాటు వివిధ వర్గాల అభిప్రాయాలను అక్కడి ప్రభుత్వ యంత్రాంగం స్వీకరించనుంది. ఇప్పటికే వందలాది కంపెనీలు, వాణిజ్య బృందాలు, వ్యక్తులు అక్కడి ప్రభుత్వానికి లేఖల రూపంలో సూచనలు చేస్తూ... అదనపు టారిఫ్ల వల్ల వినియోగదారులపై ధరల భారం పడుతుందని స్పష్టంచేశారు. లాభాలను కోల్పోవడంతో పాటు అమెరికన్ కంపెనీలు, చైనా నుంచి కీలక విడిభాగాలను కొనుగోలు చేసే ప్రత్యర్థి కంపెనీలతో పోటీ పడలేక, వ్యాపార అవకాశాలను కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

ఇండియాలో పోరు
అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతుండగానే అమెరికా- భారత్ మధ్య సుంకాల పోరుకు తెరలేవడంతో సోమవారం మన స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. భారత్కు వాణిజ్యపరంగా ఉన్న కొన్ని ప్రాధాన్యతలను అమెరికా తొలగించడం, దీనికి ప్రతిగా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై భారత్ సుంకాలు విధించడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.

భారీగా సుంకాలు పెంచిన భారత్
అమెరికా నుంచి దిగుమతయ్యే కొన్ని వస్తువులపై భారత్ భారీగా సుంకాలు పెంచింది. భారత్ నుంచి దిగుమతయ్యే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై ఇటీవల అమెరికా ప్రభుత్వం పన్నులు పెంచిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిగా భారత్ అమెరికా నుంచి దిగుమతయ్యే బాదం, పప్పుధాన్యాలు, వాల్నట్ తదితర 28 వస్తువులపై పన్ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ పెంపు అమల్లోకి వచ్చింది.

28 వస్తువులపై పన్ను భారం
అమెరికాలో తయారయ్యే, అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. వాల్నట్పై 30 శాతం నుంచి 120 శాతానికి, పప్పులపై 30 నుంచి 70 శాతానికి పన్ను పెరగనుంది. ఫలితంగా ఈ 28 వస్తువులపై పన్ను భారం పెరిగి, దేశీయ మార్కెట్లో వీటి ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ పెంపుతో భారత్కు 217 మిలియన్ డాలర్ల ఆదాయం అధికంగా సమకూరనుంది. కాగా, అమెరికా ప్రభుత్వం చర్యతో భారత్కు 2.4కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లింది.


Click it and Unblock the Notifications