అమెరికాలో 'మేడ్ ఇన్ ఇండియా' హవా షురూ.. చైనా కన్నా 20% తక్కువ ధరకే మన ఎలక్ట్రానిక్స్..!
Trump tariff India advantage : ప్రపంచ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ను మార్చేసేలా ట్రంప్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులకు భారీ ఊరటనిచ్చింది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు వంటి వాటిపై కొత్తగా వేయాలనుకున్న సుంకాలను రద్దు చేసింది. దీంతో అమెరికా మార్కెట్లో, చైనా నుంచి వచ్చే ఎలక్ట్రానిక్స్తో పోలిస్తే భారత్లో తయారైనవి ఏకంగా 20% తక్కువ ధరకే లభించనున్నాయి.
* సుంకాల ఊరటతో భారత్కు కలిసొచ్చిన కాలం
ఇది భారత్లో తయారైన ఐఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అమెరికాలో బలమైన పోటీ ప్రయోజనాన్ని అందిస్తుంది. అసలు వివరాల్లోకి వెళ్తే, అమెరికా ఇటీవల తన దిగుమతి సుంకాల నియమాలను సవరించింది. భారత్ నుంచి వచ్చే ఎలక్ట్రానిక్స్పై ముందుగా ప్రతిపాదించిన 26% సుంకాన్ని పూర్తిగా తొలగించింది.

ఇదే మినహాయింపు వియత్నాంకు కూడా లభించింది. కానీ, చైనా నుంచి దిగుమతి అయ్యే ఐఫోన్లు, ఇతర గాడ్జెట్లపై మాత్రం 20% భారీ సుంకం కొనసాగుతోంది. ఈ మార్పుతో, అమెరికా ఎలక్ట్రానిక్స్ దిగుమతి మార్కెట్లో చైనా కన్నా తక్కువ ధరలకు ఉత్పత్తులను అందించగల ప్రధాన పోటీదారులుగా భారత్, వియత్నాం నిలిచాయి.
* భారత్ వైపు యాపిల్ చూపు..
యాపిల్ సంస్థకు అమెరికా స్మార్ట్ఫోన్ మార్కెట్లో 50 శాతానికి పైగా వాటా ఉంది. ఈ మార్పుతో తయారీ కేంద్రాన్ని చైనా నుంచి భారత్కు మరింత వేగంగా మార్చే అవకాశముంది. ఇప్పటికే భారత్లో ఫాక్స్కాన్ (67% వాటా), పెగాట్రాన్ (17%), టాటా ఎలక్ట్రానిక్స్ (16%) వంటి దిగ్గజ సంస్థలు ఐఫోన్లు ఉత్పత్తి చేస్తున్నాయి.
తాజాగా అమెరికా సుంకాలను రద్దు చేయడంతో, యాపిల్ సంస్థకు రెండు రకాలుగా ప్రయోజనం చేకూరుతుంది. ఒకటి, చైనాపై ఆధారపడటాన్ని చాలావరకు తగ్గించుకోవచ్చు. రెండు, తయారీ ఖర్చులను ఆదా చేసుకోవచ్చు. ఇది భారతదేశంలో ఉత్పత్తిని మరింత పెంచడానికి యాపిల్కు అదనపు ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
* రికార్డు స్థాయికి చేరిన ఎగుమతులు
ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) గణాంకాల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొబైల్ ఫోన్ల ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ.2 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది నమోదైన రూ.1.29 లక్షల కోట్లతో పోలిస్తే ఇది ఏకంగా 55% వృద్ధి.
విశేషమేమిటంటే, ఈ ఎగుమతుల్లో కేవలం ఐఫోన్ల వాటానే రూ.1.5 లక్షల కోట్లుగా ఉంది. అలాగే, దేశంలో మొత్తం మొబైల్ ఫోన్ల ఉత్పత్తి కూడా రూ.4.22 లక్షల కోట్ల నుంచి రూ.5.25 లక్షల కోట్లకు పెరిగింది. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్గా భారత్ వేగంగా ఎదుగుతోందనడానికి ఈ అంకెలు నిదర్శనం.
* మార్కెట్ను స్థిరంగా ఉంచే ప్రయత్నం
అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) విభాగం ప్రకారం, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్స్, మానిటర్లు, హార్డ్ డ్రైవ్లు, కొన్ని రకాల సెమీకండక్టర్ విడిభాగాలు వంటి కీలక ఎలక్ట్రానిక్స్కు ఈ సుంకాల మినహాయింపులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అమెరికా వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో ధరలు అమాంతం పెరగకుండా చూడటమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం.
సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడటమే కూడా ఇందులోని భాగమే. అయితే, చిప్ల తయారీకి ఉపయోగించే యంత్రాలకు మాత్రం ఈ ఊరట వర్తించదు. ఇది అమెరికా వాణిజ్య విధానంలో పూర్తి మార్పు కాదని, కేవలం ఒక వ్యూహాత్మక సర్దుబాటు మాత్రమేనని నిపుణులు భావిస్తున్నారు.
ఐఈఎస్ఏ (ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్) అధ్యక్షుడు అశోక్ చాందక్ మాట్లాడుతూ, "ఇది స్వల్పకాలిక ఊరట అయినా, భారత్ వంటి దేశాలు మరిన్ని ప్రపంచ తయారీ సంస్థలను ఆకర్షించడానికి దీర్ఘకాలిక అవకాశాలను అందిస్తుంది" అని అన్నారు. ఇది భారతదేశానికి చాలా ప్రయోజనకరమని చెప్పవచ్చు.
* భారత్కు ఇదే సరైన సమయం..
ప్రపంచవ్యాప్తంగా చైనా నుంచి ఇతర దేశాలకు తయారీని తరలించే ప్రక్రియ కొనసాగుతోందని, ఇది పెద్ద ఆటంకాలు లేకుండా భారత్ నిలకడగా వృద్ధి చెందడానికి వీలు కల్పిస్తోందని ఆయన జోడించారు. ఇప్పుడు లభించిన ఈ 20% సుంకం ప్రయోజనంతో, అమెరికాకు అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా మారేందుకు భారత్కు బలమైన అవకాశం దక్కింది.
పెరుగుతున్న ఉత్పత్తి సామర్థ్యం, రికార్డు స్థాయి ఎగుమతులు, అనుకూలమైన వాణిజ్య నిబంధనలు... ఇవన్నీ కలిసి భారతీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను, ప్రత్యేకించి ఐఫోన్లను, అంతర్జాతీయ మార్కెట్లలో మరింత పోటీతత్వంగా నిలుపుతున్నాయి.


Click it and Unblock the Notifications








