ఎట్టకేలకు 5G సేవలు ప్రారంభించిన Vi... త్వరలో 100 నగరాలకు విస్తరణ..!
ప్రముఖ టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా (Vi) ఎట్టకేలకు 5G నెట్వర్క్ను లాంచ్ చేసింది. ఈ నెల రెండో వారంలో ముంబైలో 5G ట్రయల్స్ ప్రారంభించింది. తాజాగా ముంబైలో పూర్తిస్థాయిలో 5G నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 2025 నెలలో ఢిల్లీ, బెంగళూర్, మైసూర్, పాట్నా, చండీగఢ్ వంటి ప్రాంతాల్లో 5G లాంచ్ చేస్తామని Vi తెలిపింది. ఇప్పటికే దేశంలో జియో, ఎయిర్టెల్ సంస్థలు 5G నెట్వర్క్ను అందిస్తున్నాయి. ఇప్పటికే అత్యధిక ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చింది. మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి.
తక్కువ ధరకు అన్లిమిటెడ్ 5G :
ప్రారంభ ఆఫర్ లో (Vodafone idea 5G) భాగంగా రూ.299 మరియు అంతకంటే ఎక్కువ రీఛార్జ్లపైన అన్లిమిటెడ్ డేటాను అందిస్తోంది. ఏప్రిల్ లో కొన్ని ప్రాంతాల్లో 5G నెట్వర్క్ అందుబాటులోకి రానుండగా.. మహారాష్ట్ర, చెన్నై, కేరళ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మెరుగైన 5G స్పీడ్ అందించేలా :
ముంబైలో వోడాఫోన్ ఐడియా 5G మెరుగైన కనెక్టివిటీ కోసం నోకియా సపోర్టు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరింత ఆప్టిమైజ్ చేసేందుకు, Ai ఆధారిత సెల్ఫ్ ఆర్గనైజింగ్ నెట్వర్క్ను ప్రవేశపెట్టింది. వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, వీడియో కాన్ఫరెన్స్ వంటి సందర్భాల్లో మెరుగైన అనుభూతిని అందించేలా ఏర్పాటు చేసింది.
భారీగా పెట్టుబడులు :
Vi నెట్వర్క్ విస్తరణ కోసం భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇందుకోసం భారీగా నిధులు సమకూర్చుకుంటుంది. 4G, 5G నెట్వర్క్ను మరింత మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. జియో, ఎయిర్టెల్ వంటి సంస్థలు 5G నెట్వర్క్ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ రేస్లో Vi వెనకబడింది. ఈ కారణంగా అనేక మంది యూజర్లు ఆయా నెట్వర్క్లకు పోర్టింగ్ అయ్యారు.
ఏకంగా 100 నగరాల్లో :
తాజాగా 5G నెట్వర్క్ అందుబాటులోకి రావడం వల్ల ఇతర నెట్వర్క్లకు వెళ్లే యూజర్ల సంఖ్య తగ్గుతుందని వోడాఫోన్ ఐడియా భావిస్తోంది. వచ్చే మూడు సంవత్సరాల కాలంలో 17 టెలికాం సర్కిల్స్లోని 100 నగరాలకు 5G నెట్వర్క్ను విస్తరిస్తామని సంస్థ చెబుతోంది.
రూ.299 రీఛార్జ్ ప్లాన్ నుంచే :
ప్రస్తుతం రూ.299 రీఛార్జ్ ప్లాన్ నుంచే అన్లిమిటెడ్ 5G డేటాను అందిస్తోంది. ఇతర నెట్వర్క్లతో పోలిస్తే ఈ ఆఫర్ యూజర్లను ఆకట్టుకొనే అవకాశం ఉంది. రూ.299 రీఛార్జ్ ప్లాన్లో భాగంగా అన్లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు.
ప్రారంభ ఆఫర్లో భాగంగా :
దీంతోపాటు ప్రతిరోజు 1GB 4G డేటాతోపాటు అన్లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. ప్రారంభ ఆఫర్లో భాగంగా ఈ ఆఫర్ను Vi ప్రవేశపెట్టింది. ఎన్ని రోజులపాటు అందుబాటులో ఉంటుందో వెల్లడించలేదు. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో 5G అందుబాటులో ఉంటుంది.
అత్యధిక ప్రాంతాల్లో 5G కనెక్టివిటీ :
దేశంలో 5G కనెక్టివిటీపై పార్లమెంట్ లో ఆ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటన చేశారు. ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు లిఖికపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 776 జిల్లాలకు గాను 773 జిల్లాల్లో 5G నెట్వర్క్ ప్రారంభం అయిందని తెలిపింది. ప్రజలకు మెరుగైన నెట్వర్క్ కనెక్టివిటీ కోసం కేంద్ర ప్రభుత్వం నిబద్దతతో వ్యవహరిస్తోందని తెలిపింది.


Click it and Unblock the Notifications








