భారీ నష్టాలు, ఆస్తులు అమ్మే ఆలోచనలో వొడాఫోన్‌ ఐడియా

By Gizbot Bureau
|

భారీ రుణభారంతో కుదేలైన వొడాఫోన్‌ ఐడియా కంపెనీ ఆస్తుల విక్రయానికి వివిధ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఆప్టిక్‌ ఫైబర్‌ వ్యాపారాన్ని విక్రయించడానికి బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌తోనూ, నవీ ముంబైలో ఉన్న డేటా సెంటర్‌ను అమ్మేయడానికి ఎడెల్‌వీజ్‌ గ్రూప్‌తోనూ ఐడియా చర్చలు జరుపుతోందని సమాచారం. సంబంధిత వర్గాల కథనం ప్రకారం... వొడాఫోన్‌ ఐడియా కంపెనీ తన 1,56,000 కిమీ. ఆప్టిక్‌ ఫైబర్‌ వ్యాపారాన్ని విక్రయించడానికి బ్రూక్‌ఫీల్డ్‌ సంస్థతో పాటు ఇతర సంస్థలతో కూడా చర్చలు జరుపుతోంది. ఈ వ్యాపారం విలువ 150–200 కోట్ల డాలర్ల మేర ఉండొచ్చని అంచనా. ఇక నవీ ముంబైలోని డేటా సెంటర్‌ను ఎడెల్‌వీజ్‌ సంస్థకు చెందిన ఎడెల్‌వీజ్‌ ఈల్డ్‌ ప్లస్‌ ఫండ్‌ కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ డేటా సెంటర్‌ విలువ 6–10 కోట్ల డాలర్ల మేర ఉండొచ్చు.

రూ.53,000 కోట్ల బకాయిలు

సవరించిన స్థూల రాబడి(ఏజీఆర్‌)కు సంబంధించి వొడాఫోన్‌ ఐడియా రూ.53,000 కోట్ల బకాయిలను మూడు నెలల్లోగా చెల్లించాలని సుప్రీం కోర్ట్‌ ఈ ఏడాది అక్టోబర్‌24న తీర్పునిచి్చంది. ఈ ఆస్తుల విక్రయం ద్వారా ఈ బకాయిలను కొంతైనా తీర్చాలని ఈ కంపెనీ యోచిస్తోంది. అయితే టెలికం రంగానికి రూ.7 లక్షల కోట్లకు పైగా బకాయిలు ఉండటంతో ఆప్టిక్‌ ఫైబర్‌ ఆస్తుల విక్రయానికి బ్యాంక్‌లు అభ్యతరం చెప్పే అవకాశాలున్నాయి.

ఆందోళన వ్యక్తం చేసిన కుమార మంగళం బిర్లా

ఇదిలా ఉంటే ఐడియా లిమిటెడ్ భవితవ్యంపై ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వొడాపోన్ ఐడియాకు ప్రభుత్వం ఊరట కల్పించకుంటే సంస్థను మూసివేయక తప్పదన్నారు. రెండ్రోజుల క్రితం హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి రూ.53,038 కోట్ల పాతబకాయిలు చెల్లించాల్సి ఉన్న వొడాఫోన్ ఐడియాకు ఉపశమనం లభించని పక్షంలో ఈ సంస్థ భవితవ్యం ఏమిటనే ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ... ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి చేయూత లేకుంటే వొడాఫోన్‌ ఐడియా కథ ముగిసిట్టే భావిస్తానన్నారు. 

రుణభారం రూ.1.17 లక్షలకోట్లకు
 

మందగమనం నేపథ్యంలో ప్రభుత్వం వివిధ రంగాలకు ఉపశమనం కల్పిస్తోందని, టెలికం రంగం కూడా ఎంతో కీలకమైందనే వాస్తవం ప్రభుత్వానికి బోధపడిందని, కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ ఇండియా టెలికం రంగంపైనే ఆధారపడి ఉందని, ప్రభుత్వం నుంచి మరిన్ని ఉద్ధీపనలు అవసరమన్నారు. ఉచిత వాయిస్ కాల్స్, అతితక్కువ ధరకు డాటాను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ముఖేశ్‌ అంబానీకి చెందిన జియో దేశీయ టెలికం మార్కెట్లో మొదలుపెట్టిన యుద్ధాన్ని తట్టుకునేందుకు బిర్లా నేతృత్వంలోని ఐడియా సెల్యులార్‌ గత ఏడాది వొడాఫోన్ ఇండియా పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీతో కలిసి వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌గా ఏర్పడింది. ఈ విలీన సంస్థ రుణభారం రూ.1.17 లక్షలకోట్లకు పెరిగింది.

సుప్రీం కోర్టు తీర్పు

పైగా దేశంలోని టెలికం సంస్థల నుంచి పాతబకాయిలను వసూలు చేయాలన్న ప్రభుత్వ వాదనను సమర్థిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌కు శరాఘాతమైంది. ఈ తీర్పుతో వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్, ఇతర టెలికం సంస్థలు గత పద్నాలుగేళ్ళకు సంబంధించిన లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం వినిమయ చార్జీలు, వాటిపై వడ్డీ, జరిమానా కలిపి ప్రభుత్వానికి దాదాపు రూ.1.47 లక్షల కోట్ల పాత బకాయిలు చెల్లించాల్సి వస్తోంది. 

వొడాపోన్ ఐడియాకే ఎక్కువ దెబ్బ

దీనిని అధిగమించేందుకు వడ్డీని, జరిమానాను రద్దు చేయడం ద్వారా తమ బకాయిలను సగానికి తగ్గించాలని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. అలాగే సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలుచేశాయి. ఇదిలా ఉండగా, AGRపై సుప్రీం కోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ తిరస్కరణకు గురైతే ఎయిర్ టెల్ కంటే వొడాపోన్ ఐడియాకే ఎక్కువ దెబ్బ పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వొడాఫోన్ ఐడియా ఇప్పటికే భారీ నష్టాల్లో ఉండటంతో రివ్యూ పిటిషన్‌ కొట్టివేత ఆ సంస్థకు ఇబ్బందేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Best Mobiles in India

English summary
Voda-Idea in talks with Brookfield, Edelweiss to sell assets: Sources; telco denies

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X