అంబానీని ఢీకొట్టేందుకు భారీ స్కెచ్ వేసిన వొడాఫోన్
జియో రాకతో దేశీయ టెలికాం రంగంలో రోజు రోజుకు వార్ వేడెక్కుతోంది. జియో దెబ్బకు కొన్ని కంపెనీలు పత్తా లేకుండా పోగా.. మరికొన్ని విలీనమైపోయాయి.
జియో రాకతో దేశీయ టెలికాం రంగంలో రోజు రోజుకు వార్ వేడెక్కుతోంది. జియో దెబ్బకు కొన్ని కంపెనీలు పత్తా లేకుండా పోగా.. మరికొన్ని విలీనమైపోయాయి.జియో వచ్చి రావడంతోనే సునామిని తలపించిన నేపథ్యంలో ఇప్పుడు ఇతర టెల్కోలు కూడా ఆత్మరక్షణలో పడ్డాయి. ఇందులో భాగంగానే దాంతో పోటీపడుతూ కొత్త ఆఫర్లను పెడుతున్నాయి. ఆఫర్లతో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న జియో అధినేతకు పోటీగా ఇప్పుడు వొడాఫోన్, ఐడియాలు ఏకమై కొత్త ఆఫర్లను అందించేందుకు రెడీ అయ్యాయి. భారీ వ్యూహానికి తెరలేపాయి. అదేంటో ఓ సారి చూద్దాం.

భారీ ప్లాన్
భారీ మార్కెట్ సాధించిన జియోను ఢీకొట్టేందుకు వొడాఫోన్ - ఐడీయా లిమిటెడ్ భారీ ప్లాన్తో వస్తోంది. మార్కెట్లో జియోకి పోటీగా రూ.25వేల కోట్ల పెట్టుబడులను సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. దీనిలో రూ. 11వేల కోట్లను వొడాఫోన్ సమకూర్చగా.. ఐడియా రూ.7వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతోంది.

పెట్టుబడి
మిగిలిన పెట్టుబడిని ఇండస్ టవర్ లిమిటెడ్ కంపెనీలోని తమ 11.5శాతం షేర్లు అమ్మకం ద్వారా సమకూర్చుకోనున్నారు. ఉత్సాహపూరితమైన పోటీ వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఈ పెట్టుబడులు సమీకరిస్తున్నట్టు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. మరి ఈ పోటీని ముఖేశ్ ఎలా ఎదుర్కోనున్నారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

ఎయిర్టెల్ అదే బాటలో
ఇదిలా ఉంటే టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ కూడా వీరికి ధీటుగానే దూసుకెళుతోంది. ఇందులో భాగంగా రూ.1699 కి ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ను రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు రోజుకు 1 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 365 రోజులుగా నిర్ణయించారు. ఇప్పటికే జియో, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్లు ఈ తరహా ప్లాన్లను అందిస్తుండగా, ఆ జాబితాలోకి ఎయిర్టెల్ వచ్చి చేరింది.

బీఎస్ఎన్ఎల్ అదే దారి
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా కొత్త దారిలో వెళుతోంది. భారత్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవలను ప్రారంభించింది. ఇందులో భాగంగా రోజుకు 35 జీబీ డేటాను కేవలం రూ.1.1 కే 1 జీబీ డేటా చొప్పున అందివ్వనుంది. ఇప్పటికే ఎయిర్టెల్తోపాటు త్వరలో రానున్న రిలయన్స్ జియో బ్రాడ్ బ్యాండ్ను దృష్టిలో ఉంచుకుని బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ను వినియోగదారులకు అందివ్వనుంది.

బీఎస్ఎన్ఎల్
ఈ ప్లాన్లో 100 ఎంబీపీఎస్ గరిష్ట స్పీడ్ వినియోగదారులకు లభిస్తుంది. కాగా జియో తన గిగాఫైబర్ సేవలను దేశవ్యాప్తంగా 1400 సిటీలలో ప్రారంభించనున్న విషయం విదితమే. మరోవైపు ఎయిర్టెల్ కూడా ప్రత్యర్థి కంపెనీలకు పోటీగా తన బ్రాడ్బ్యాండ్ ప్లాన్లను మార్చడంతోపాటు కస్టమర్లకు భారీ ఎత్తున ఆఫర్లను అందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications








