మొబైల్ యూజర్లకు డేంజర్ బెల్స్.. ఫేక్ కాల్లో 1 నొక్కగానే రూ.2 లక్షలు గోవిందా.. కొత్త మోసంతో జాగ్రత్త!
IVR scam: బెంగళూరు నగరంలో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి తెరలేపారు. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (IVR) కాల్స్ ద్వారా అమాయకులను బురిడీ కొట్టించి, క్షణాల్లో వారి ఖాతాల నుంచి డబ్బు కొట్టేస్తున్నారు. తాజాగా 57 ఏళ్ల మహిళ ఒకరు ఈ తరహా మోసంలో ఏకంగా రూ.2 లక్షలు పోగొట్టుకున్నారు. ఈ కొత్త మోసం గురించి తెలుసుకుంటే మీరు కూడా షాక్ అవుతారు. దీన్నుంచి అందరూ జాగ్రత్తగా పడాల్సిన అవసరం ఉంది.
బాధితురాలు సుమిత్ర (పేరు మార్చినది), వయస్సు 57 ఏళ్లు, బెంగళూరులోని దత్తాత్రేయనగర్, హోసకేరెహళ్లిలో నివాసం ఉంటున్నారు. జనవరి 20వ తేదీ మధ్యాహ్నం 3:55 గంటలకు ఆమెకు 01412820071 నంబర్ నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆశ్చర్యకరంగా, ఆమె ఫోన్ స్క్రీన్పై కాలర్ ఐడీ "SBI" అని చూపించింది. సుమిత్రకు SBI బ్యాంకులో ఖాతా ఉంది.

ఫోన్ లిఫ్ట్ చేయగానే ఒక రికార్డ్ చేసిన వాయిస్ మెసేజ్ వినిపించింది. ఇంగ్లీషులో ఉన్న ఆ మెసేజ్ సారాంశం "మీ ఖాతా నుంచి రూ.2 లక్షలు బదిలీ అవుతున్నాయి". అంతేకాదు, "మీరు ఆ లావాదేవీని చేసి ఉంటే 3 నొక్కండి, చేయకపోతే 1 నొక్కండి" అని రెండు ఆప్షన్లు కూడా ఇచ్చారు.
అంతే, సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమె ఎలాంటి లావాదేవీకి అనుమతి ఇవ్వలేదు. కాస్త తటపటాయించి ఏమీ నొక్కకుండా ఉండిపోయారు. వాయిస్ మెసేజ్ మళ్లీ మళ్లీ మూడుసార్లు వినిపించింది. "మీరు స్పందించడం లేదు" అని హెచ్చరించింది. భయంతో, గందరగోళంలో చివరకు ఆమె ఆ లావాదేవీని ఆపడానికి 1 నొక్కారు.
* రూ.2 లక్షల గోవిందా
ఆ వెంటనే "దయచేసి మీ బ్యాంకును సందర్శించి, వెంటనే మేనేజర్ను కలవండి." అంటూ మరో మెసేజ్ ప్లే అయింది. సెకన్లలో కాల్ కట్ అయిపోయింది. సుమిత్రకు గుండెల్లో దడ మొదలైంది. వెంటనే తన బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకున్నారు. అది చూసి ఆమె కళ్లు తిరిగినంత పనైంది. ఖాతాలో నుండి రూ.2 లక్షలు మాయమయ్యాయి.
వెంటనే బ్యాంకుకు పరుగులు తీశారు. మేనేజర్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కి కాల్ చేయమని, పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించారు. మోసగాళ్ల ఖాతాను ఫ్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తామని కూడా హామీ ఇచ్చారు. తక్షణమే సుమిత్ర సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత గిరినగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
* ఇది చాలా డిఫరెంట్
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అండ్ భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 318 (మోసం) కింద కేసుగా నమోదు చేశారు. సైబర్ క్రైమ్ అధికారులు ఇది సాధారణ IVR మోసాల కంటే భిన్నమైనదని భావిస్తున్నారు.
చాలా మోసాలలో బాధితులను డెబిట్ కార్డ్ చివరి నాలుగు అంకెలు, ఖాతా నంబర్, పుట్టిన తేదీ లేదా ఇమెయిల్ ID వంటి సున్నితమైన సమాచారాన్ని షేర్ చేసేలా మోసగాళ్లు చేస్తారు. ఈ వివరాలతో డబ్బు కొట్టేస్తారు. కానీ సుమిత్ర కేసులో ఆమె ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. పోలీసులు రెండు విషయాలను అనుమానిస్తున్నారు.
సుమిత్ర తెలియకుండానే కాల్లో ఏదైనా సమాచారం ఇచ్చి ఉండవచ్చు. లాగిన్ వివరాలు అవసరం లేకుండానే డబ్బును కొట్టేసే కొత్త టెక్నిక్ను మోసగాళ్లు కనిపెట్టి ఉండవచ్చు. "కేవలం '1' లేదా '3' నొక్కడం ద్వారా డబ్బును దొంగిలించడం సాధ్యం కాదు. బాధితురాలు ఎలాంటి వివరాలు షేర్ చేయకపోతే, ఇది కచ్చితంగా కొత్త తరహా మోసమే." అని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
మరింత దర్యాప్తు తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి రోజుకో కొత్త ట్రిక్ ఉపయోగిస్తున్నారు. సురక్షితంగా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బ్యాంకు నుంచి వచ్చినట్లు కనిపించే కాల్స్ను అస్సలు నమ్మకూడదు. బ్యాంకులు ఆటోమేటెడ్ కాల్స్ ద్వారా లావాదేవీలను నిర్ధారించమని ఎప్పటికీ అడగవు.
* కాల్స్ లిఫ్ట్ చేయకూడదు
ఇలాంటి కాల్స్లో ఎప్పుడూ ఏ కీనీ నొక్కవద్దు. వెంటనే ఫోన్ కట్ చేయాలి. అనుమానాస్పద కాల్ వస్తే, ఆ అలర్ట్ నిజమైనదా కాదా అని తెలుసుకోవడానికి మీ బ్యాంకుకు నేరుగా కాల్ చేయాలి. మోసం జరిగిన వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కి రిపోర్ట్ చేయాలి. లేదా www.cybercrime.gov.in వెబ్సైట్ను సందర్శించాలి.


Click it and Unblock the Notifications








