మరణించాకా... సోషల్ మీడియా అకౌంట్ల పరిస్థితి ఏంటి..? మెటా వద్ద వింతైన టెక్నాలజీ..!
Meta Grief Tech : మనిషి సంఘజీవి ఇది నాటి మాట.. ప్రస్తుతం మనిషి సోషల్ మీడియా జీవిగా క్రమంగా మారిపోతున్నాడు!. ఎందుకంటే గంటలపాటు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ, చూస్తూ గడిపేస్తున్నాడు. ఇటీవల కాలంలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు సోషల్ మీడియా ఖాతాలను కలిగి ఉంటున్నారు. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ క్రమంగా ఈ తరహా పరిస్థితి కనిపిస్తోంది. డేటా వినియోగం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటోంది.
సోషల్ మీడియా.. మంచి, చెడు రెండు విధాలుగానూ ప్రభావం చూపుతోంది. అయితే చిన్నారులపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించేందుకు అనేక దేశాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. మెటా వంటి సంస్థలు కూడా చిన్నారుల కంటెంట్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయి. ఫీచర్లు తీసుకొస్తున్నాయి.

ఈ సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా?
అయితే మనిషి చనిపోయాక సోషల్ మీడియా ఖాతాల పరిస్థితి ఏంటి..? ఆ ఖాతాలు అలానే ఉంటాయా..? ఆటోమేటిక్ గా డిలీట్ అవుతాయా..? ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి వచ్చే ఉంటాయి. అలాంటి ప్రశ్నే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ల మాతృసంస్థ మెటాకు కూడా ఎదురైంది.
మనిషి మరణించిన అనంతరం :
దీనిపై పనిచేసిన మెటా ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం డిసెంబర్ 2025 లో మెటా ఈ అంశంపై పేటెంట్ పొందినట్లు తెలుస్తోంది. మనిషి మరణించిన అనంతరం కూడా సోషల్ మీడియా ఖాతాలు యాక్టివ్ గా ఉండేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్బాట్ ను మెటా సిద్ధం చేస్తోందని తెలుస్తోంది.
అంటే ఓ వ్యక్తి సుధీర్ఘకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నా లేదా మరణించినా.. వారి తరఫున మెటా ఏఐ చాట్బాట్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అంటే ఈ చాట్బాట్ ఎలా పనిచేస్తుందంటే.. సదరు వ్యక్తి గతంలోని పోస్టులు, కామెంట్లను ఏఐ చాట్బాట్ అధ్యయనం చేస్తుంది.
మెటా గ్రీఫ్ టెక్ :
ఆ వివరాల ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ పనిచేస్తుంది. ఆ వ్యక్తి తరహాలోనే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది, రిప్లైలు ఇస్తుంది. దీనిని 'గ్రీఫ్ టెక్' (Meta Grief Technology) అని మెటా పిలుస్తోంది. అంటే బాధను తగ్గించే టెక్నాలజీ అని అర్థం. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, రిప్లికా వంటి సంస్థలు కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి.
కొంత వింతగా అనిపించినా! :
మనిషి మరణించిన అనంతరం వారి సోషల్ మీడియాలో పోస్టులు చేయడం, రిప్లై ఇవ్వడం కొంత వింతగా అనిపిస్తుంది. అయితే మెటా ఈ టెక్నాలజీపై స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతానికి ఈ టెక్నాలజీని ఒక ఆలోచనగానే పేటెంట్ పొందామని, ఇప్పట్లో అమలు చేసే ప్లాన్ ఏదీ లేదని మెటా చెబుతోంది.
అనేక టెక్ సంస్థలు భవిష్యత్ అవసరాల కోసం ఇలాంటి పేమెంట్లు తీసుకుంటాయి. అయితే ఇందులో చాలా వరకు వినియోగంలోకి రావని తెలుస్తోంది. త్వరలో దీనిపై మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








