ఒడిశా రైలు ప్రమాద ఘటనతో వార్తల్లోకి వచ్చిన 'కవచ్'.. ఈ రక్షణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్తు దేశాన్ని విషాదంలోకి నెట్టింది. శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 280పైగా ప్రయాణికులు మరణించారు. మరో 900 మందికిపైగా గాయపడ్డారు. వారిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఘటనపై రైల్వే శాఖ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. సిగ్నల్ లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని తన నివేదికలో పేర్కొంది. ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందే కోరమాండల్ ఎక్స్ప్రెస్ మెయిన్లైన్ నుంచి లూప్లైన్లోకి మారిందని తెలిపింది. కోరమాండల్ ఎక్స్ప్రెస్ను మెయిన్లైన్లో వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. లూప్లైన్ లోకి వచ్చిందని.. రైల్వే శాఖ తెలిపింది.

అయితే అప్పటికే లూప్లైన్లో ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు వెల్లడించింది. దీంతో కోరమాండల్ రైలు పట్టాలు తప్పి కొన్ని బోగీలు పక్క ట్రాక్లో పడినట్లు పేర్కొంది. ఆ సమయంలో ఆ ట్రాక్పైకి బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ వచ్చిందని. ట్రాక్పైనున్న బోగీలను ఢీకొట్టి ఆ రైలు కూడా పట్టాలు తప్పినట్లు రైల్వే తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది.
ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది. అయితే ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్న రోజుల్లోను ఇంత పెద్ద ప్రమాదం జరగడంపై చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం తీసుకొచ్చిన కవచ్ రక్షణ వ్యవస్థ దృష్టిపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. కవచ్ అక్కడ అందుబాటులో ఉంటే ఇంత ఘోర ప్రమాదం జరిగేది కాదని కొందరు విశ్లేషిస్తున్నారు.

ఆటోమేటిక్ ట్రైయిన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కవచ్: రైల్వేలో భద్రతను మరింతను మెరుగుపరచడంలో భాగంగా భారతీయ రైల్వే 2022 మార్చి 23న ఆటోమేటిక్ ట్రైయిన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (ATP) 'కవచ్' పై ప్రకటన చేసింది. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్డాండర్డ్ ఆర్గనైజేషన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రతికూల పరిస్థితులు, దట్టమైన మంచు కురుస్తున్న సమయాల్లో రైల్వే లోకోపైలెట్కు సాయం చేసేందుకు కవచ్ను రూపొందించారు. ఓవర్ స్పీడ్ను నియంత్రించడంలో లోకోపైలెట్కు సహకరిస్తుంది. మరియు అవసరమైనప్పుడు ఆటోమేటిక్గా బ్రేకులు వేస్తుంది. వంతెన, కీలక మలుపుల్లో రైలు వేగాన్ని కవచ్ నియంత్రిస్తుంది. మరియు ప్రమాదాలు జరగకుండా లోకోపైలెట్ను అప్రమత్తం చేస్తుంది.

ఏదైనా సందర్భంలో లోకోపైలెట్ విఫలం అయితే కవచ్ ఆటోమేటిక్గా బ్రేకులు వేస్తుంది. అధిక వేగం, పొగమంచు కురుస్తున్న సమయాల్లో స్పష్టమైన విజిబిలిటీ కోసం క్యాబిన్లో లైన్ సైడ్ సిగ్నల్ డిస్ప్లే కలిగి ఉంటుంది. మరియు లెవల్ క్రాసింగ్ వద్ద ఆటోమేటిక్ విజిల్ వేయడం, లోకో టూ లోకో కమ్యూనికేషన్ ద్వారా ప్రమాదాలను నివారిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో SOS ఫీచర్ ద్వారా రైళ్లను నియంత్రిస్తుంది.
దక్షిణ మధ్య రైల్వేలోని లింగంపల్లి- వికారాబాద్- వాడి, వికారాబాద్- బీదర్ మార్గాల్లో సుమారు 250 కిలోమీటర్ల మేర కవాచ్ ట్రయల్ నిర్వహించారు. ట్రయల్ విజయవంతమైన తర్వాత మిగిలిన మార్గాలో అభివృద్ధి చేసేందుకు ముగ్గురు వెండర్స్ను ఆమోదించారు. ఢిల్లీ - హౌరా మరియు ఢిల్లీ- ముంబై మార్గాల్లో 2024 మార్చి నాటికి కవచ్ అందుబాటులో తీసుకురావాలనే లక్ష్యం నిర్దేశించుకున్నారు. అనంతరం వచ్చిన ఫలితాలలో మరింత విస్తరించాలని నిర్ణయించినట్లు సమాచారం.
భారతీయ రైల్వే ప్రమాదాల్లోనే ఒడిశా ప్రమాదం అతిపెద్దదని తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత కవచ్ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. కవచ్ ఉంటే ప్రమాదం చాలా వరకు తప్పేదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications