గూగుల్ క్రోమ్ 79ని ఎందుకు అప్డేట్ చేస్తోంది,వాడొద్దని ఎందుకు చెబుతోంది ?
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ ఉపయోగించే వారందరూ ఉపయోగించే ముఖ్యమైన బ్రౌజర్ గూగుల్ క్రోమ్. ఈ బ్రౌజర్ ఆండ్రాయిడ్ ఫోన్ లో డీఫాల్ట్ గా రావడంతో పాటు వినియోగించేటప్పుడు కూడా స్మూత్ గా ఉండటంతో అందరూ గూగుల్ క్రోమ్ నే ఉపయోగిస్తారు. ఈ మధ్య ఈ గూగుల్ క్రోమ్ ఆండ్రాయిడ్ వెర్షన్ కు తాజాగా క్రోమ్ 79 అప్ డేట్ వచ్చింది. అందరూ దీన్ని వినియోగించడం ఆ తర్వాత దీనిపై అనేక రకాలైన కంప్లయింట్లు రావడంతో ఈ పీచర్ వచ్చిన కొన్ని రోజులకే ఈ అప్ డేట్ ను నిలిపివేస్తూ గూగుల్ నిర్ణయం తీసుకుంది.దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

ఈ అప్ డేట్ ను ఇన్స్టాల్ చేసుకున్నాక కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ నుంచి డేటాను ఈ వెర్షన్ తుడిచివేస్తుందని కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. క్రోమ్ లో ఉండే బిల్ట్-ఇన్ ఫ్రేమ్ వర్క్ వల్ల ఈ లోపం ఏర్పడినట్లు తెలుస్తోంది.

మన స్మార్ట్ ఫోన్ లో వెబ్ డేటా స్టోర్ అయ్యే లొకేషన్ అప్ డేట్ అయిన కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు క్రోమియం పోస్టులు, ఆండ్రాయిడ్ పోలీస్ పోస్టుల ద్వారా తెలుస్తోంది.అయితే ఒక గూగుల్ క్రోమ్ ప్రతినిధి ఒకరు దీనికి సంబంధించిన క్రోమ్ 79 అప్ డేట్ ను నిలిపివేసినట్లు క్రోమియం పేజీకి తెలిపారు. కానీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ డివైస్ ల్లో సగం డివైస్ లు ఈ అప్ డేట్ ను ఇన్ స్టాల్ చేసుకున్నాయి. ఇప్పుడు గూగుల్ ఈ సమస్యపైనే పనిచేస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పరిష్కారంతో ముందుకు వస్తామని ఆ ప్రతినిధి పేర్కొన్నారు.

గూగుల్ క్రోమ్ ఇందులో రెండు రకాల పరిష్కారాల కోసం వెతుకుతోంది. ప్రస్తుతం ఉన్న ఫైల్స్ ను కొత్త స్థానానికి మార్చడం, లేకపోతే ఆ ఫైల్స్ ను ఇంతకుముందు ఉన్న స్థానాలకే తిరిగి పంపించేలా చేయడం. ఈ రెండిట్లో ఏ పరిష్కారంతో ముందుకు రావాలని గూగుల్ అనుకుంటుందో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

కాబట్టి మీ ఫోన్ కు ఒకవేళ గూగుల్ క్రోమ్ 79 అప్ డేట్ వస్తే చేసుకోకండి. తర్వాత అప్ డేట్ వచ్చే వరకు ఆగండి. ఇప్పటికే ఆ అప్ డేట్ చేసుకుని ఉంటే వేర్వేరు యాప్ ల్లో ఉండే మీ డేటాలో ముఖ్యమైన సమాచారాన్ని వేరే చోట స్టోర్ చేసుకోండి. డేటా విషయంలో చాలా జాగ్రత్త వహించండి. ఎందుకంటే డేటాను ఒక్కసారి కోల్పోతే తిరిగి పొందడం కష్టం.


Click it and Unblock the Notifications








