బ్రాండ్ ఇమేజ్ కోసం కార్పొరేట్లు కోట్లాది రూపాయలు వెచ్చించడానికి కారణం

మహీంద్రా అండ్ మహీంద్రా... ట్రాక్టర్ల తయారీ నుంచి ప్రారంభమై ప్రస్తుతం రిసార్ట్స్ నిర్మాణం వరకూ విస్తరించింది. ఈ మార్గమధ్యంలో ఐటి విభాగంలోనూ ప్రవేశించింది. సంస్థ వైస్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు టార్గెట్ ఆడియన్స్ గురించిన స్పష్టమైన అవగాహన ఉండే వుంటుంది. అందుకే తొలి రీబ్రాండింగ్ 'రైజ్' అంటూ ప్రచారం ప్రారంభించారు. దీని గురించి ఆయన సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లో ప్రధమంగా ప్రస్తావించారు. ట్విట్టర్లో యువత తనను ఫాలో కావాలన్నదే ఆయన అభిమతం. సంస్థ కొత్త లోగోను ఆయన ట్విట్టర్లో ఉంచి యువత స్పందన కోరుతున్నారు. రీబ్రాండింగ్ దిశగా ఆకర్షించే లోగోదే ప్రధాన పాత్ర కావడంతో బహిరంగంగా విడుదల చేసే ముందు ఆయన వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించాలనుకుంటున్నట్టు తెలిపారు.
మరోవైపు టాప్ టూ వీలర్ సంస్థ హీరో హోండా కొత్త బ్రాండ్ నేమ్, లోగోలను తయారు చేసే కాంట్రాక్టు 'ఓల్ఫ్ ఓలిన్స్'కు ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో వినూత్నతకు మారుపేరుగా నిలిచిన ఈ సంస్థ కొత్త బ్రాండ్ ఐడెంటిటీని అందరూ మెచ్చే రీతిలో తీర్చిదిద్దగలదని భావిస్తున్నట్టు హీరో హోండా మోటార్స్ లిమిటెడ్ ఎండి పవన్ ముంజాల్ గతవారం వ్యాఖ్యానించారు. హీరో హోండా నుంచి జపాన్ హోండా తన వాటాలను విక్రయించి వైదొలగ నుండడంతో కొత్త బ్రాండ్ ఐడెంటిటీ కావాలని హీరో గ్రూప్ భావిస్తోంది. ఇందుకోసం 200 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డట్టు సమాచారం.
భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రీ బ్రాండింగ్ కోసం 100 నుంచి 300 కోట్ల రూపాయల వరకూ ఖర్చవుతుందని అంచనా. హీరో గ్రూప్ తాము కొత్త లోగో కోసం 100 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నామని ప్రకటించింది. అయితే, 2009లోనే విడియోకాన్ 200 కోట్లతో, ఆపై తాజాగా ఎయిర్టెల్ 300 కోట్లతో కొత్త ఇమేజ్ను కొనుగోలు చేశాయి. చాలా సందర్భాల్లో కొత్త బ్రాండింగ్ వైపు కస్టమర్లను తీసుకురావడం కష్టమేనని విశ్లేషకుల అంచనా. తొలుత ఉద్యోగుల్లో కాన్ఫిడెన్స్ను తీసుకురావాల్సి వుంటుంది. ఆ తరువాతే వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా కొత్త ఇమేజ్ను ప్రజల్లోకి తీసుకువెడితే సత్ఫలితాలు సాధించవచ్చని కార్పొరేట్ నిపుణులు వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications








