షియోమి నుంచి 108 ఎంపి కెమెరాతో 4 స్మార్ట్ఫోన్లు
ఇప్పుడు స్మార్ట్ఫోన్ కంపెనీల మధ్య కెమెరా వార్ నడుస్తున్నది. కెమెరా విభాగంలో దిగ్గజ మొబైల్ కంపెనీలన్నీ ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. ఇప్పటి వరకు స్మార్ట్ఫోన్లలో 48 మెగాపిక్సెల్ కెమెరాను మాత్రమే చూశాం. త్వరలో శాంసంగ్ 64 ఎంపీ కెమెరాతో, షియోమి రియల్మీ స్మార్ట్ఫోన్లు విడుదల చేయనున్నాయి. కాగా 48 ఎంపీ కెమెరాతో ఇప్పటికే ట్రెండ్ సెట్ చేసిన షియోమి ఇప్పుడు 100 లేక 108 మెగాపిక్సెల్ కెమెరాతో స్మార్ట్ఫోన్ని మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఈ ఫోన్లో 108,000,000 పిక్సెల్స్, 12032×9024 రిజల్యూషన్ ఉండనుంది.

ఇప్పటికే షియోమీ తన సంస్థ నుంచి రెడ్మీ నోట్ ప్రోతో 48 ఎంపీ కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చింది. గత నెలలో 64 ఎంపీ కెమెరా కలిగిన ఫోన్కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇక అంతటితో ఆగకుండా ఏకంగా 108 ఎంపీల కెమెరా కలిగిన ఫోన్ తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. లీకయిన సమాచారం ప్రకారం త్వరలోనే 108 ఎంపీ కెమెరా ఉండే స్మార్ట్ఫోన్లను షియోమి మార్కెట్లోకి తీసుకురానుంది. ఇప్పటికే సామ్సంగ్ 108 ఎంపీ ఇసోసెల్ బ్రైట్ హెచ్ఎమ్ఎక్స్ కెమెరా సెన్సర్ను స్మార్ట్ఫోన్లను వాడతామని తెలిపిన షియోమి ఇప్పుడు ఆ దిశగా ముందడుగు వేస్తోంది.

ఈ ఫోన్లకు టుకానా, డ్రాకో, ఉమి, సిమి అనే కోడ్ పేర్లు పెట్టారు. అయితే మిగతా ఎలాంటి ఫోన్ల ప్రత్యేకతలను షియోమి కంపెనీ విడుదల చేయలేదు. ఇప్పటికే మ్యాక్స్4 ఫోన్ 108 ఎంపీ కెమెరాతో రానుందని ప్రచారం సాగినా అది రూమర్ మాత్రమేనని కంపెనీ స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా, శాంసంగ్ ఇప్పటికే ఇసోసెల్ బ్రైట్ హెచ్ఎమ్ఎక్స్ కెమెరా సెన్సర్లను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తోంది. ఆ కెమెరా సెన్సర్తో 12,032*9024 పిక్సెల్ రిజొల్యుషన్తో ఫోటోలు తీయవచ్చు. ఈ సెన్సర్ 0.8మైక్రోమీటర్ పిక్సెల్ పరిమాణంలో వస్తోంది. అంటే.. డీఎస్ఎల్ఆర్ కెమెరాల్లో మాదిరిగా ఫోటోల నాణ్యత ఉండనుంది.

ప్రపంచంలో తొలి 100 ఎంపీ కెమెరా ఫోన్ ఇదే అవుతుంది. కాగా 100 మెగాపిక్సెల్ కెమెరా మోడల్ను అభివృద్ధి చేస్తున్నట్టు ఈ ఏడాది మార్చిలో లెనొవో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే... దానికంటే ముందుగానే తీసుకొస్తున్న షియోమి 100 ఎంపికి బదులుగా 108 మెగాపిక్సెల్తో తన ఫోన్ను తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications