ఆంధ్రప్రదేశ్లో షియోమి కొత్త ప్లాంట్, నిరుద్యోగులు సిద్ధమవండి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి తనదైన నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు. పలు సంచలన నిర్ణయాలతో ఎన్నికల హామీల అమలు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి పలు కంపెనీలు ఏపీలో ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయి.

తాజాగా ఇప్పుడు మరో కంపెనీ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్లాంటు ఏర్పాటుకు రెడీ అవుతోంది. ఈ విషయాన్ని షియోమి ఇండియా హెడ్ మనుకుమార్ జైన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.

ఏపీ సీఎంను కలిసిన మనుకుమార్ జైన్
చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ షియోమి ఏపీలో మరో కొత్త ప్లాంటు ఏర్పాటుకు సిద్ధంగా ఉంది. ప్లాంటు ఏర్పాటు అంశానికి సంబంధించి షియోమి ఇండియా హెడ్ మనుకుమార్ జైన్ ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. మనుకుమార్ జైన్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.

మనుకుమార్ జైన్ ట్వీట్
‘జగన్ గారు చాలా సింపుల్గా, సాదాసీదాగా కనిపిస్తారు. కానీ అద్భుతమైన ఆత్మవిశ్వాసం ఉంది. ఆయన నుంచి మేం చాలా నేర్చుకున్నాం. మేకిన్ఇండియా ప్రణాళికల గురించి చర్చించాం. మా ఫోన్లు చాలావరకు ఏపీలోనే తయారవుతున్నాయి'' అని ట్వీట్ చేశారు.

సీఎం ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ఇదే అంశం
మరోవైపు ఆంధ్రప్రదేశ్ సీఎం ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఒక ట్వీట్ ఉంది. ఇందులో ‘ఆంధ్రప్రదేశ్లో మరో ప్లాంటుకు షియోమి ఆసక్తిగా ఉంది. మరో ప్లాంటు ఏర్పాటు వల్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి అని ఉంది.

రేణిగుంట సమీపంలోని ఎలక్ట్రానిక్ పార్క్లో
కాగా కంపెనీ చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోని ఎలక్ట్రానిక్ పార్క్లో మరో యూనిట్ ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తోంది.ఇందులో భాగంగా ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. కొత్త ప్లాంట్లో మొబైల్ ఫోన్లతోపాటు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారుచేసే ఆలోచన ఉన్నట్లు పేర్కొన్నారు.

ఏం తయారుచేయబోతున్నారు
విద్యుత్ సైకిళ్లు, ట్రైసైకిళ్లు, స్కూటర్ల తయారీ యోచనా చేస్తున్నట్లు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్లాంట్ ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత ప్రతినిధులకు తెలిపారు. షియోమీ ఇండియా ఎండీ మనుకుమార్ జైన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మురళీకృష్ణన్ సీఎంతో భేటీ అయినవారిలో ఉన్నారు. అంతకు ముందు షియోమీ ప్రతినిధులు సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డిని కూడా కలిశారు. తమ పరిశ్రమలో కల్పించే ఉద్యోగాల్లో 95 శాతం మహిళలకే కేటాయిస్తామని వారు వెల్లడించారు.


Click it and Unblock the Notifications








