పత్తాలేని జుకర్ బర్గ్, ఒక్క రోజులో 40 బిలియన్ డాలర్ల సంపద అవుట్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ భారీ చిక్కుల్లో పడింది. తాజాగా యూరోపియన్ యూనియన్ గోప్యతా నియమాలకు సంబంధించి విచారణ నేపథ్యంలో గణనీయమైన వ్యాపార నష్టాలను ఎదుర్కొంటోంది.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ భారీ చిక్కుల్లో పడింది. తాజాగా యూరోపియన్ యూనియన్ గోప్యతా నియమాలకు సంబంధించి విచారణ నేపథ్యంలో గణనీయమైన వ్యాపార నష్టాలను ఎదుర్కొంటోంది. 50 మిలియన్ల మంది ఫేస్బుక్ ఖాతాల వివరాలు లీక్ అయ్యాయన్న ఆరోపణలు ఫేస్బుక్ షేర్ను తీవ్ర నష్టాల్లోకి జార్చాయి. అంతేకాదు మార్కెట్ క్యాప్ రాత్రికి రాత్రే తీవ్రంగా నష్టపోయింది. డాటా బ్రీచ్ వార్తలతో మార్క్ జుకర్బర్గ్ 2004లో స్థాపించిన ఫేస్బుక్ విలువలో 40 బిలియన్ డాలర్ల విలువ తుడిచిపెట్టుకుపోయింది. 2004 తరువాత ఇదే అతిపెద్ద క్షీణత అని ఎనలిస్టులు చెబుతున్నారు.ఇది ముందు ముందు ఇంకా క్షీణించే అవకాశం ఉందని తెలుస్తోంది.

సీఈవో మార్క్ జుకెర్ బెర్గ్
ఫేస్బుక్ యూజర్లు ఐదు కోట్ల మంది సమాచారం చోరీకి గురైన విషయం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు దారితీస్తుంటే, మరోవైపు ఆ సంస్థ అధినేత, సీఈవో మార్క్ జుకెర్ బెర్గ్ మాత్రం ఇప్పటికీ స్పందించకుండా మౌనం దాలుస్తుండడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వీళ్లెక్కడికి పోయారు?
కనీసం ఫేస్ బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, కంపెనీ ప్రజా సంబంధాల వ్యూహకర్త షెరిల్ శాండ్ బర్గ్ కూడా ఇంత వరకు స్పందించకపోవడంతో వీళ్లెక్కడికి పోయారు? అన్న సందేహాలు చాలా మందిలో మొదులుతున్నాయి.

విమర్శలు వచ్చినా, వివాదాలు ఏర్పడినా..
సాధారణంగా ఫేస్ బుక్ కు సంబంధించి విమర్శలు వచ్చినా, వివాదాలు ఏర్పడినా జుకెర్ బెర్గ్ కానీ, షెరిల్ శాండ్ బర్గ్ లో ఎవరో ఒకరు బ్లాగ్ ద్వారా స్పందిస్తుంటారు. కానీ, డేటా చోరీపై వీరింత వరకు మీడియా ముందుకు రాలేదు. ఈ వారం కంపెనీ ఉద్యోగులను ఉద్దేశించి జుకెర్ బెర్గ్ మాట్లాడాల్సి ఉంది.

వివరణ ఇవ్వాలని ..
కేంబ్రిడ్జ్ అనలైటిక అనే ఆన్ లైన్ ప్రకటనల కన్సల్టింగ్ కంపెనీ, ఫేస్ బుక్ యూజర్ల సమాచారాన్ని అనధికారికంగా సేకరించినట్టు ఆరోపణలు రాగా, దీన్ని ఫేస్ బుక్ కూడా ధ్రువీకరించిన విషయం తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాలని యూరోపియన్ యూనియన్, బ్రిటిష్ చట్ట సభ సభ్యులు ఇప్పటికే డిమాండ్ చేయడం గమనార్హం.

సమన్లు జారీ
ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్కు బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసింది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయడానికి 50 మిలియన్ల ఫేస్బుక్ ఖాతాదారుల డేటాను బ్రిటన్కు చెందిన రాజకీయ కన్సల్టింగ్ సంస్థ వాడుకున్నదన్న దానిపై జూకర్బర్గ్కు ఈ సమన్లు జారీ అయ్యాయి.


Click it and Unblock the Notifications








