ఫేస్బుక్ అధినేతకి ఇండియా సీరియస్ వార్నింగ్, టచ్ చేసి చూడు..
ఇండియాలో ఫేస్బుక్ గడ్డు పరిస్థితులను ఎదుర్కునే దిశగా అడుగులు పడుతున్నాయి. డేటా బ్రీచ్ వ్యవహారం ఈ సోషల్ మీడియాని ముప్పతిప్పలుపెడుతోంది.
ఇండియాలో ఫేస్బుక్ గడ్డు పరిస్థితులను ఎదుర్కునే దిశగా అడుగులు పడుతున్నాయి. డేటా బ్రీచ్ వ్యవహారం ఈ సోషల్ మీడియాని ముప్పతిప్పలుపెడుతోంది. అమెరికా ఎన్నికల్లో - బ్రిటన్ లో బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణలో ఫేస్బుక్ సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనాలటికా అనే సంస్థ ఫుల్లుగా ఉపయోగించకుందని.. యూజర్ల సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటిక్స్ కు అందివ్వడంలో ఫేస్ బుక్ పాత్ర ఉందనడానికి బలమైన ఆధారాలున్నాయని అంతర్జాతీయ సమాజం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా కూడా ఫేస్బుక్ సంస్థను తీవ్రంగా హెచ్చరించింది. కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇండియాలో 2019లో జరగబోయే ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తే సహించే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని..
వచ్చే ఏడాది ఇండియాలో జరగనున్న ఎన్నికల్లో ఫేస్బుక్ అధినేత జోక్యం చేసుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని చోరి చేసినట్టు తెలిస్తే సమన్లు పంపుతామని ఐటీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ మార్క్ జుకర్ బర్గ్ను హెచ్చరించారు.

20 కోట్ల మంది భారతీయులు..
మీడియా స్వేచ్ఛకు తాము అడ్డుకాదని అయితే దాన్ని దుర్వినియోగం చేస్తే చట్ట పరమైన చర్యలను తీసుకొంటామని తెలిపారు. అమెరికా తర్వాత ఫేస్ బుక్ కు అతి పెద్ద మార్కెట్ భారతేనని.. 20 కోట్ల మంది భారతీయులు ఫేస్ బుక్ ను ఉపయోగిస్తున్నారని .. ఏ చిన్న తేడా చేసినా ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆయన అన్నారు.

ఐటీ చట్టం కింద కఠిన చర్యలు..
అలాంటి ప్రయత్నాలు చేస్తే ఐటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకునే వీలుందని... ఆ చట్టం కింద జుకర్ బర్గ్ ను భారత్ కు రప్పించడానికి సమన్లు జారీ చేయడానికి వెనుకాడబోమని రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో..
కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థకు దాదాపు 5 కోట్ల మంది ఫేస్బుక్ ఖాతాల సమచారం చిక్కిందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ హెచ్చరికలు చేశారు.

భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని..
కాగా భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో Facebook అధినేత స్పష్టం చేశారు. భారత్ తో బాటు బ్రెజిల్ ఎన్నికల్లో ఫేస్ బుక్ యూజర్ల డేటా దుర్వినియోగం కాకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.

ఇతర పార్టీలకు సంబంధాలు..
కాగా ఈ సంస్థతో కాంగ్రెస్ పార్టీకి అలాగే దేశంలో కొన్ని పార్టీలకు సంబంధాలు ఉన్నాయనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలను కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. ఈ విషయంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ సేవలను ఎన్నడూ ఉపయోగించుకోలేదన్నారు.


Click it and Unblock the Notifications








