డేటా లీకేజి వ్యవహారంపై ఫేస్బుక్ అధినేత ఆసక్తికర వ్యాఖ్యలు
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫేస్బుక్ డేటా లీక్పై ఆ సంస్థ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ స్పందించారు.
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫేస్బుక్ డేటా లీక్పై ఆ సంస్థ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ స్పందించారు. జరిగిన దానికి మమ్మల్ని క్షమించండి అని చెప్పిన జుకర్ బర్గ్.. ఇది మాకో గుణపాఠమని తెలిపారు. ఫేస్బుక్ వ్యవస్థాపకుడిగా యూజర్లందరి డేటాను గోప్యంగా ఉంచడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. అసలు ఇదంతా ఎలా జరిగింది? అనే విషయంపై ప్రస్తుతం పని చేస్తున్నామని.. భవిష్యత్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా ఇలాంటివి జరుగుతాయని కొన్ని సంవత్సరాల క్రితమే ఊహించామని చెప్పిన ఆయన.. వాటి కోసం అప్పట్లోనే జాగ్రత్తలు కూడా తీసుకున్నామని తెలిపారు. అయితే తమలోని కొన్ని తప్పిదాల వలనే ఇప్పుడు ఇలా జరిగిందని చెప్పారు.

వీలైనంత త్వరగా
ఇప్పుడు వచ్చిన ఈ సమస్యను అధిగమించడానికి తమకు చాలా సమయం పడుతుందని, అయితే వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు తమ టీం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అలాగే ఈ సమయంలో తమకు మద్దతుగా ఉన్న వారందరికీ కృతఙ్ఞతలని తెలిపారు మార్గ్ జుకర్ బర్గ్.

అయిదు కోట్లమంది ఫేస్ బుక్ వినియోగదారుల సమాచారాన్ని..
2016 లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం పని చేసిన కేంబ్రిడ్జి అనలిటికా..అయిదు కోట్లమంది ఫేస్ బుక్ వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఫేస్ బుక్ పై విమర్శలు చెలరేగాయి. ఇప్పటికే అమెరికాలోని శాన్ జోస్ కోర్టులో కేసు కూడా నమోదైంది.

యూజర్ల డేటాను రక్షించటం..
యూజర్ల డేటాను రక్షించటం తమ ప్రధాన బాధ్యతగా చెప్పిన జుకర్.. యూజర్ల డేటాను పరిరక్షించే విషయంలో తప్పు చేస్తే తాము యూజర్లకు సేవ చేసే అర్హతను కోల్పోతామని చెప్పారు. జరిగిన ఘటనకు సంబంధించి సంస్థ ద్వారా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

యూఎస్ కాంగ్రెస్ ముందు..
అటు-అవసరమైతే యూఎస్ కాంగ్రెస్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జుకర్ బర్గ్.. భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

భారత్ తో బాటు బ్రెజిల్ ఎన్నికల్లో..
భారత్ తో బాటు బ్రెజిల్ ఎన్నికల్లో ఫేస్ బుక్ యూజర్ల డేటా దుర్వినియోగం కాకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా..కేంబ్రిడ్జి అనలిటికా బోర్డు తమ సీఈవో అలెగ్జాండర్ నిక్స్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.


Click it and Unblock the Notifications








