సైబర్ సెగలతో వేడెక్కిన డిజిటల్ ఇండియా
ఒకవైపు దేశంలో అంతర్జాల సేవలు వేగంగా విస్తరిస్తుండగా, మరోవైపు ఇది సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారుతోంది. దేశంలోని ప్రతి గ్రామాన్ని ఇంటర్నెట్తో అనుసంధానించి, సాంకేతికాభివృద్ధి ఫలాలను భారతీయులందరికీ సమానంగా పంచాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన డిజిటల్ ఇండియా కార్యక్రమాన్నీ అవకాశంగా మలుచుకోవాలని అంతర్జాల అరాచకవాదులు పొంచి చూస్తున్నారని సెక్యూరిటీ సొల్యూషన్ల సంస్థ ఫైర్ఐ తెలిపింది. ఆసియా ఫసిపిక్ దేశాలకు సంబంధించి ఈ సంస్థ ప్రకటించిన 1 హెచ్ 2015 రీజనల్ అడ్వాన్స్ డ్ థ్రెట్ రిపోర్ట్ లో భారతే అత్యధికంగా సైబర్ నేరగాళ్లకు వ్యూహాత్మక లక్ష్యంగా మారిందని తెలిపింది. ఈమేరకు ‘రీజనల్ అడ్వాన్స్డ్ త్రెట్ రిపోర్ట్ ఫర్ ఏషియా ఫసిఫిక్-2015' పేరిట నివేదికను విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం..
Read more:సైబర్ నేరగాళ్లతో ఎంపికి దిమ్మతిరిగింది

38 శాతం సంస్థలపై దాడులు
ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో దేశంలోని దాదాపు 38 శాతం సంస్థలపై అంతర్జాల అరాచక వాదులు దాడికి పాల్పడ్డారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి 23 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో వీరికి భారత్ ప్రధాన లక్ష్యంగా మారుతోంది.

ఆసియా-ఫసిఫిక్ దేశాల్లో భారత్ నాలుగో స్థానం
సైబర్ దాడుల విషయంలో ఆసియా-ఫసిఫిక్ దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనం. 50 శాతం టెలికాం సంస్థలు, ప్రభుత్వ విభాగాలు సైబర్ దాడుల బారిన పడిన వాటిలో ఉన్నాయి.భారత్ లో డిజిటల్ ఇండియా లో భాగంగా కంపెనీలు తమ డాటాను డిజిటలైజ్ చేస్తున్న నేపథ్యంలో దాని తస్కరణకు హ్యాకింగ్ పెరిగిందని సైబర్ నేరగాళ్లు ప్రధాన లక్ష్యం ఇండియానేనని ఫైర్ ఐ ప్రతినిధి బ్రైస్ బోలాండ్ తెలిపారు.

వైమానిక, రక్షణ వ్యవస్థలపై దాడికి యత్నం
ప్రధానంగా మన దేశ మేధోపరమైన హక్కులకు ముప్పు పొంచి ఉంది. ఇటీవల చైనాకు చెందిన హ్యాకర్లు దేశీయ సంస్థలపై దాడికి పాల్పడటాన్ని ఇందులో భాగంగానే చూడొచ్చు. ఈ దేశానికే చెందిన ఏపీటీ30 హ్యాకర్ల బృందం దాదాపు పదేళ్లపాటు ఇతర దేశాల మీద సైబర్ నేరాలకు పాల్పడ్డాయి.

ఏపీటీ30
ఇందులో భారతీయ వైమానిక దళం, రక్షణ సంస్థలున్నాయి. దేశ సరిహద్దు వివాదాలు, దౌత్య సంబంధాల వివరాలను వాటర్మెయిన్ లక్ష్యంగా చేసుకుంది. ఏపీటీ30..దశాబ్ద కాలం పాటు భారతీయ అంతరిక్ష,రక్షణ సంస్థలపై నిఘా పెట్టిందని ఫైర్ ఐ ప్రతినిధి బ్రైస్ బోలాండ్ అన్నారు.

అత్యాధునిక భద్రతా వ్యవస్థను రూపొందించాలి
ఎప్పటికప్పుడు సైబర్ భద్రతకు సంబంధించిన టూల్స్ ను మెరుగు పరస్తూ ఉండటమే ఇందుకు పరిష్కారం. సైబర్ దాడులను వెంటనే గుర్తించడంతోపాటు, సమర్థంగా ఎదుర్కొనే అత్యాధునిక వ్యవస్థను రూపొందించుకోవాలి. కార్పొరేట్ సంస్థలు, వాణిజ్య సంఘాలు, ప్రభుత్వం కలిసి కట్టుగా ఇందుకు పని చేయాల్సి ఉంటుందని వారు అంటున్నారు.

ఇంతకు ముందు అనేక హెచ్చరికలు
భారత నెటిజనులకు ఇంతకు ముందు అనేక హెచ్చరికలు వచ్చాయి ! మన సైబర్ స్పేస్ లోకి ''బయోజీ'' అనే డేంజరస్ వైరస్ తో మన కంప్యూటర్ల మీద దాడి ప్రారంభమైంది. వేరే ఎక్కడో కూర్చున్న సైబర్ నేరగాళ్ళు మన కంప్యూటర్ లలోకి చొరబడి సమాచారం మార్చివేయడం ,తస్కరించడం , కొత్త సమాచారం ప్రవేశపెట్టడం లేదా పూర్తిగా సమాచారాన్ని తీసివేయడం లాంటి దాడులకు పాల్పడ్డారు.

కంప్యూటర్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని..
అయితే వైరస్ ఐదు రూపాల్లో మన కంప్యూటర్లలోనికి ప్రవేశిస్తుందని , అది రిమోట్ పద్దతిలో పని చేస్తుందని సైబర్ దాడుల నిరోధక సంస్థ (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా) తెలిపింది. కంప్యూటర్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

సైబర్ దాడులు చెయ్యడానికి సిద్దం
ఇక ఉగ్రవాదులను తయారు చేసి భారత్ మీదకు పంపించి విధ్వంసాలు సృష్టిస్తున్న పాకిస్థాన్ ఇప్పుడు సైబర్ దాడులు చెయ్యడానికి సిద్దం అయ్యిందని ఈ మధ్య కథనాలు వెలుగు చూశాయి. పాకిస్థాన్ లోని ఐఎస్ఐ విభాగానికి చెందిన సైబర్ ఆర్మీ అనేక సార్లు సైబర్ దాడులు చేసి భారత్ కు చెందిన సమాచారం హ్యాక్ చెయ్యడానికి ప్రయత్నించింది.

పాక్ సైబర్ ఆర్మీ భారత్ సీబీఐ వెబ్ సైట్ లను హ్యాక్
పాక్ సైబర్ ఆర్మీలో 500 మందికి పైగా పని చేస్తున్నారని, వారు నిత్యం భారత్ సమాచారం హ్యాక్ చెయ్యడానికి వేచి చూస్తుంటారని కథనం వెలుగు చూసింది. అనేక సంవత్సరాల క్రితం పాక్ సైబర్ ఆర్మీ భారత్ సీబీఐ వెబ్ సైట్ లను హ్యాక్ చేసింది. ఆ సందర్బంలో కొన్ని రోజులు సీబీఐ వెబ్ సైట్ ను బ్లాక్ చేశారు.

సైబర్ యుద్ధానికి సిద్దం
ఇప్పుడు అదే తరహాలో భారత్ వెబ్ సైట్ లను హ్యాక్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని ఈ మధ్య వెలుగు చూసింది. సరిహద్దులలో నిత్యం పదేపదే కాల్పులు జరుపుతు భారత్ ను రెచ్చగొడుతున్న పాక్ ఇప్పుడు సైబర్ యుద్ధానికి సిద్దం అయ్యిందని వెలుగు చూడటంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

నిపుణులు చాలా తక్కువ
అయితే ఈ సైబర్ దాడిని ఎదుర్కోవడానికి మన దేశంలో నిపుణులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. భారత్లో కేవలం 556మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఉంటే చైనాలో 1.25 లక్షల మంది, అమెరికాలో 91,080మంది, రష్యాలో 7,300మందీ ఉన్నారు.

4,446మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులను..
భారతీయ వెబ్ సైట్ల మీద చైనా, పాకిస్థాన్, అమెరికా, ఐరోపా, బ్రెజిల్, టర్కీ, బంగ్లాదేశ్, అల్జీరియా, యుఏఇ దేశాలలోని సర్వర్ల ద్వారా జరుగుతున్న సైబర్ దాడులను ఎదుర్కోవాలంటే మరింతమంది సెక్యూరిటీ నిపుణులు కావాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని 4,446మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులను నియమించుకోవాలని భారత ప్రభుత్వం నిశ్చయించింది.

అయిదు లక్షల మంది సైబర్ నిపుణులను ..
ఐటీలోని వివిధ రంగాల్లో అయిదు లక్షల మంది సైబర్ నిపుణులను తయారుచేయాలని జాతీయ సైబర్ భద్రతా విధానం తీర్మానించింది. సైబర్ భద్రత దిశలో సర్కారు ఎంత త్వరగా ముందడుగేస్తే దేశానికి అంత మేలు!

గిజ్ బాట్ పేజీని లైక్ చేయండి
మీరు ఎప్పటికప్పుడు టెక్నాలజికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.
https://www.facebook.com/GizBotTelugu


Click it and Unblock the Notifications








