2 కోట్ల కాల్స్ ఫెయిల్..ఎయిర్టెల్పై నిప్పులు చెరిగిన జియో
రిలయన్స్ జియో ఎయిర్టెల్ల మధ్య ఇంటర్ కనెక్షన్ యుద్ధం తారాస్థాయికి చేరింది. నువ్వంటే నువ్వని కొట్టుకుంటున్నారు. ఇంటర్ కనెక్టివిటీ పాయింట్ల (పీఓఐ) విషయంలో ఎయిర్టెల్ తమను మోసం చేసిందని రిలయన్స్ ఆరోపించింది. ఇస్తామన్న పీఓఐలు ఇవ్వకపోవడంతో రోజూ రెండు కోట్లకు పైగా కాల్స్ డ్రాప్ అవుతున్నట్టు పేర్కొంది. అయితే ఇందుకు ధీటుగానే ఎయిర్టెల్ కూడా మాటల దాడిని ప్రారంభిచింది.
షాక్: జియో సిమ్లు వెనక్కి ఇచ్చేస్తారట..ఎందుకో తెలుసా..?

ఇంటర్కనెక్షన్ వివాదం
ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, భారతీ రిలయన్స్ జియో ఎయిర్టెల్ల మధ్య ఇంటర్కనెక్షన్ వివాదం మరింతగా ముదురుతోంది.

2 కోట్లకుపైగా కాల్స్ ఫెయిల్
ఎయిర్టెల్ కస్టమర్లతో తమ మొబైల్ వినియోగదారులు కనెక్ట్ అయ్యేందుకు వీలుగా తగినన్ని ఇంటర్ కనెక్టివిటీ పాయింట్ల (పీఓఐ) ను కల్పించకపోవడంవల్ల రోజుకు 2 కోట్లకుపైగా కాల్స్ ఫెయిల్ అవుతున్నాయని జియో ఆరోపించింది.

నాలుగోవంతును మాత్రమే
తమకు అవసరమైన పోర్ట్లలో నాలుగోవంతును మాత్రమే ఎయిర్టెల్ అందుబాటులో ఉంచిందని ..తన మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తూ, పోటీ కంపెనీలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని పేర్కొంది.

ఆరోపణలను ఖండించిన ఎయిర్టెల్
అయితే, రిలయన్స్ ఆరోపణలను ఎయిర్ టెల్ ఖండించింది. రిలయన్స్ జియో అవసరాలకు మించి కనెక్టివిటీ పాయింట్లను ఇచ్చామని చెబుతోంది. పెంచిన పీఓఐలతో రిలయన్స్ జియో 1.5 కోట్ల కంటే ఎక్కువ మంది ఎటువంటి కాల్ డ్రాప్స్ లేకుండా వాయిస్ సేవలు అందుకునే అవకాశం ఉందని ఎయిర్టెల్ స్పష్టం చేసింది.

పది కోట్ల మంది ఖాతాదారుల అవసరాల కంటే
రిలయన్స్కు ఉన్న పది కోట్ల మంది ఖాతాదారుల అవసరాల కంటే ఎక్కువ పీఓఐలే ఇచ్చినట్టు పేర్కొంది. జియో టెక్నాలజీలోనే లోపం ఉందని, దానిని సరిచేసుకోకుండా తమపై నిందలు వేయడం బాధాకరమని పేర్కొంది.

మరిన్ని ఇంటర్ కనెక్ట్ పాయింట్లను అందించేలా
ఇప్పటికే మరిన్ని ఇంటర్ కనెక్ట్ పాయింట్లను అందించేలా కెపాసిటీని పెంచుకునేందుకు ముఖేష్ అంబానీ జియో ఎయిర్టెల్కు ఇప్పటికే నిధులందించింది. జియో నుంచి తమకు పేమెంట్ అందిందని, ఈ నిధులతో ఇరు సంస్థలూ ఫిజికల్ కలెక్షన్, పోర్టుల టెస్టింగ్ తో పాటు కనెక్టివిటీ పాయింట్ల సంఖ్యను పెంచుకుంటామని ఎయిర్టెల్ సైతం తెలిపింది.

కనెక్టివిటీ సామర్థ్యం 15 లక్షల మందికి సేవలందిస్తుందని,
90 రోజుల్లోగా రిలయన్స్ కోరినన్ని ఇంటర్ కనెక్టింగ్ పాయింట్లను అందించేందుకు కృషి చేస్తామని తాము పెంచుతున్న ఇంటర్ కనెక్టివిటీ సామర్థ్యం 15 లక్షల మందికి సేవలందిస్తుందని, జియోకు ప్రస్తుతం ఉన్న వినియోగదారులతో పోలిస్తే ఇది చాలా అధికమని ఎయిర్టెల్ ఓ ప్రకటనలో తెలిపింది.

కఠినమైన షరతులు
కాగా, ఇంటర్కనెక్ట్ పోర్ట్లను కల్పించేందుకు కఠినమైన షరతులను విధిస్తోందని .. దీనివల్ల అదనపు పోర్ట్లను వినియోగించుకోవడానికి వీలవడంలేదని జియో పేర్కొంది.

గుత్తాధిపత్యానికి..
మొబైల్ వినియోగదారులకు ఉచిత వాయిస్ కాల్స్ ప్రయోజనాన్ని అందించాలన్న తమ ప్రయత్నాలకు గండికొట్టడంద్వారా ఎయిర్టెల్ గుత్తాధిపత్యానికి పాల్పడుతున్నట్లు కూడా ఆరోపణలు గుప్పించింది.

ఎయిర్టెల్ ప్రకటించిన మర్నాడే
రిలయన్స్ జియోకు అవసరమైన ఇంటర్కనెక్ట్ పాయింట్లను అందుబాటులో ఉంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎయిర్టెల్ ప్రకటించిన మర్నాడే జియో తాజా ఆరోపణలు చేయడం గమనార్హం.

జియో ఫిర్యాదు
ప్రస్తుత టెలికం కంపెనీలు తమకు తగిన పీఓఐలను కల్పించకపోవడంవల్ల భారీగా కాల్ డ్రాప్లకు కారణమవుతున్నాయని .. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ నియంత్రణ సంస్థ ట్రాయ్కు జియో ఫిర్యాదు చేయడం తెలిసిందే.

ట్రాయ్ సంప్రదింపుల భేటీ
దీనిపై టెల్కోలు, జియో ప్రతినిధులతో ఇటీవలే ట్రాయ్ సంప్రదింపుల భేటీని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్ కంపెనీలు జియోకు అవసరమైన పీఓఐలు కల్పిస్తామంటూ ప్రకటించాయి కూడా.

జియో మళ్లీ ఆరోపణలు
ఇప్పుడు జియో మళ్లీ ఆరోపణలు గుప్పిస్తోంది. తమ రెండు నెట్వర్క్ల మధ్య కాల్స్ పూర్తి కావడానికి అవసరమైన ఇంటర్ కనెక్టివిటీ పాయింట్స్లో నాలుగో వంతు ఇచ్చిందని, ఫలితంగా ఉచిత వాయిస్ కాల్స్ అందించడంలో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంది.

తమకున్న పేరును దెబ్బతీసేందుకు
మార్కెట్లో తమకున్న పేరును దెబ్బతీసేందుకు ఎయిర్టెల్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. దీనికి ధీటుగాను ఎయిర్టెల్ సైతం కౌంటర్ మీద కౌంటర్లు ఇస్తోంది. మరి ముందు ముందు ఈ వ్యవహారం ఏమవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications








