జియో ఉచిత సునామిని అడ్డుకోవాల్సిందే :టెల్కోల మూకుమ్మడి దాడి
ముకేష్ అంబానికి చెందిన రిలయన్స్ జియో ఉచిత సునామిని అడ్డుకోవాల్సిందేనంటూ టెల్కోలు మూకుమ్మడి దాడిచేశాయి. దీంతో ఇద్దరి మధ్యా పోరు తారాస్ఠాయికి చేరింది. ట్రాయ్ సైతం ఈ విషయంలో నిర్ణయాన్ని వారికే వదిలేసింది. జియో ఉచితంపై ట్రాయ్ మీటింగ్ లో జరిగిన ముఖ్యాంశాలు ఏంటో మీరే చూడండి.
మీ కాల్స్కి కనెక్ట్ కాలేం..జియోకి షాకిచ్చిన దిగ్గజ టెల్కోలు

#1
మొబైల్ నెట్వర్క్ ఇంటర్కనెక్షన్ విషయంలో తలెత్తిన వివాదాన్ని చర్చించేందుకు జరిగిన ట్రాయ్ మీటింగ్ కు రిలయన్స్ జియో అలాగే దిగ్గజ టెల్కోలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా ప్రతినిధులు హాజరయ్యారు.

#2
అయితే ఈ మీటింగ్ లో ట్రాయ్ కార్యదర్శి సుధీర్ గుప్తా సమస్యను మీరే పరిష్కరించుకోవాలంటూ టెల్కోలకు సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ భేటీకి సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్(సీఓఏఐ) ప్రతినిధులను ట్రాయ్ ఆహ్వానించకపోవడం గమనార్హం.

#3
ఈ సమావేశంలో జియోకు తగిన ఇంటర్కనెక్టివిటీ సామర్థ్యం పెంచడానికి ప్రస్తుత టెల్కోలు సంప్రదింపులు జరుపుతాయని.. అయితే, ఒప్పందం ప్రకారం జియో విజ్ఞప్తి చేసిన 90 రోజుల్లో ఈ చర్యలకు ఆస్కారం ఉంటుందని సీఓఎఐ తెలిపింది.

#4
మా మొబైల్ నెట్వర్క్ నుంచి కాల్స్ను తమ నెట్వర్క్తో కనెక్ట్ చేయడానికి సరిపడా పోర్ట్స్ ఆఫ్ ఇంటర్కనెక్ట్(పీఓఐ) పరికరాలను ప్రస్తుత టెల్కోలు అందుబాటులో ఉంచడం లేదని ట్రాయ్కు తెలిపినట్లు జియో బోర్డు సభ్యుడు మహేంద్ర నహతా తెలిపారు. దీనివల్ల జియో కస్టమర్లు కాల్డ్రాప్ సమస్యలను ఎదుర్కొంటున్నారని కూడా చెప్పారు.

#5
అయితే తాజా భేటీకి తమను ఆహ్వానించకపోవడం అసాధారణమైన విషయమని, జియో ఒత్తిడి కారణంగానే ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుందని సీఓఏఐ డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్.మాథ్యూస్ ఆరోపించారు.

#6
రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లపై ఎయిర్టెల్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇష్టానుసారంగా ఇస్తున్న ఉచిత కాల్స్ ట్రాఫిక్ సునామీతో ఇతర కంపెనీల నెట్వర్క్లకు విఘాతం కలుగుతుంది. అలా జరగకుండా జియోను నిలువరించాలని ట్రాయ్ను కోరామని ఎయిర్ టెల్ తెలిపింది.

#7
ఇందుకు ఇంటర్ కనెక్షన్ యూసేజ్ చార్జీల (ఐయూసీ) అస్త్రాన్ని ట్రాయ్ న్యాయబద్ధంగా ఉపయోగిస్తుందని భావిస్తున్నాం. బాధ్యతగల టెలికం కంపెనీగా ఇతర ఆపరేటర్లకు తగిన ఇంటర్కనెక్టివిటీని కల్పించడంలో మేమెప్పుడూ నిబంధనలు, లెసైన్స్ షరతుల మేరకే నడుచుకుంటామని తెలిపింది.

#8
జియో పూర్తిస్థాయి వాణిజ్య సేవలు ప్రారంభమైతే ట్రాఫిక్ సమతౌల్యం మెరుగుపడుతుంది. అప్పటివరకూ జియోతో ఒప్పందం మేరకు తగినన్ని పీఓఐల ఏర్పాటుకు మేం చర్యలు తీసుకుంటాం'' అని ఎయిర్టెల్ వివరించింది.

#9
అయితే రిలయన్స్ పూర్తిస్థాయి వాణిజ్య సేవలను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభించనుంది. అప్పటి నుంచీ టారిఫ్లను వసూలు చేస్తామని వెల్లడించింది. ప్రస్తుత టెల్కోలు కావాలనే కుట్రపూరితంగా ఇంటర్కనెక్షన్ను సరిపడా ఇవ్వడం లేదని జియో చెబుతోంది.

#10
దీనికి కౌంటర్ గా జియో ఇష్టానుసారంగా ఉచిత సేవలను అందించడవల్ల వచ్చే కాల్స్ సునామీకి సరిపడా ఇంటర్కనెక్షన్ను అందించలేకపోతున్నట్లు టెల్కోలు వాదిస్తున్నాయి.

#11
ఇప్పుడున్న టెల్కోల తరఫున పోరాడుతున్న సీఓఏఐ... ట్రాయ్తోపాటు ప్రధాని కార్యాలయానికి కూడా ఇది వరకే లేఖ రాసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రాయ్ సమావేశం నిర్వహించింది.

#12
అయితే రిలయన్స్ ప్రస్తుతం అందిస్తున్నవి వాణిజ్య సేవలా కాదా అనేది మాకు స్పష్టత ఇవ్వాలని.. ఒకవేళ వాణిజ్య సేవలయితే 90 రోజులకు మించి ఉచిత సర్వీసులనివ్వడం కుదరదనేది టెల్కోల వాదన. మరి జియో స్పష్టత నిస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications



