కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరోగ్య సేతు కోవిడ్-19 ట్రాకర్ యాప్
కరోనా వైరస్ను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో ముందడుగు వేసి అధికారికంగా ఓ యాప్ను విడుదల చేసింది. ఆరోగ్య సేతు కోవిడ్-19 ట్రాకర్ యాప్ను విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్లో ఆరోగ్య సేతు కోవిడ్-19 ట్రాకర్ యాప్ను ప్రారంభించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ యాప్ను రూపొందించింది. కోవిడ్-19 ట్రాకర్ యాప్ ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్తోపాటు 11 భాషలకు సపోర్టు చేస్తోంది.

విస్తృతంగా చర్చ
కేంద్రం ఇటీవల విడుదల చేసిన ఈ కరోనా ట్రాకింగ్ యాప్పై ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. లాక్డౌన్ కారణంగా ఎక్కడివారక్కడే ఏకాంత జీవితం గడుపుతున్న నేపథ్యంలో... ప్రజలతో అనుసంధానం కావడంతో పాటు కరోనా సోకిన వ్యక్తులను ట్రాక్ చేసి అప్రమత్తమయ్యేలా కేంద్రం దీన్ని రూపొందించింది. ఐవోఎస్తో పాటు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో కూడా ఆరోగ్య సేతు పనిచేస్తుంది. బ్లూటూత్ ఆధారంగా పనిచేసే ఈ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి?
యాప్ డౌన్లోన్ చేసుకున్న తర్వాత మొదటి పేజిలో భాషను ఎంపిక చేసుకుని ‘నెక్ట్స్' బటన్పై క్లిక్ చేయాలి. తర్వాత ‘రిజిస్టర్ నౌ' అనే ట్యాబ్ క్లిక్ చేసి నియమ నిబంధనలను చదివి, వాటిని అంగీకరిస్తూ ‘ఐ అగ్రీ' ట్యాబ్ క్లిక్ చేయాలి. అనంతరం డివైజ్ లొకేషన్ అనుమతి కోరుతూ పాప్-అప్ సందేశం వస్తుంది. తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, ఓటీపీని సబ్మిట్ చేయాలి. ఆపై మీ పేరు, వయసు, వృత్తి వివరాలతో పాటు మీరు గత 30 రోజుల్లో ఏయే దేశాల్లో పర్యటించారనే సమాచారం నింపి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడితో యాప్ ఇన్స్టాలేషన్ పూర్తవుతుంది.

ఆరోగ్య సేతు వల్ల ఉపయోగాలు
మొదటి పేజీలోనే హెల్ప్లైన్ నంబర్లతో పాటు ఆరోగ్య శాఖ పెట్టే పోస్టులు, ఇతర వివరాలు, వైద్య సలహాలు అందుబాటులో ఉంటాయి. కరోనా సోకిన వ్యక్తికి దగ్గరగా వెళ్తే వెంటనే ఈ యాప్ అప్రమత్తం చేసి హెచ్చరిస్తుంది. అయితే తాజాగా నమోదైన పాజిటివ్ కేసులను మాత్రమే ఇది పసిగడుతుందని చెబుతున్నారు. అత్యంత సులభంగా వినియోగించేందుకు వీలుగా 11 భాషల్లో దీన్ని రూపొందించారు. ఆరోగ్య సేతు యాప్ను ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల వినియోగదారులు కరోనాపై అప్రమత్తం కావడంతో పాటు.. అటు ప్రభుత్వానికి కూడా సాయం చేసిన వారవుతారు.


Click it and Unblock the Notifications








