కాల్ కనెక్టింగ్పై గురి పెట్టిన ట్రాయ్, టెల్కోలపై చర్యలు !
టెలికం కంపెనీలు మరింత మెరుగైన సర్వీసులు అందించేలా టెలికం రంగ నియంత్రణ ట్రాయ్ మరిన్ని చర్యలు తీసుకుంటోంది.
టెలికం కంపెనీలు మరింత మెరుగైన సర్వీసులు అందించేలా టెలికం రంగ నియంత్రణ ట్రాయ్ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. తాజాగా కాల్ కనెక్షన్ టైమ్, కాల్ మ్యూట్ అంశాలను కూడా నాణ్యతా ప్రమాణాల జాబితాలోకి చేర్చింది. అక్టోబర్ 1 నుంచి వీటికి సంబంధించిన డేటాను సేకరిస్తున్నట్లు, తగు పరిష్కార మార్గాలను కనుగొనడంపై దృష్టి పెట్టనున్నట్లు ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. నంబర్ డయల్ చేసిన తర్వాత కాల్ కనెక్ట్ అవడానికి పట్టే వ్యవధిని కాల్ కనెక్షన్ టైమ్గా వ్యవహరిస్తారు. ఇటీవలి కాలంలో కొన్ని సందర్భాల్లో డయల్ చేసిన 30 సెకన్ల దాకా కూడా కాల్ కనెక్ట్ కాకపోతుండటాన్ని గుర్తించిన ట్రాయ్ .. తగు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

కాల్స్, మెసేజ్లను కట్టడి చేసేలా..
ఇదిలా ఉంటే కస్టమర్లను వేధించే కాల్స్, మెసేజ్లను కట్టడి చేసేలా ఇటీవల ట్రాయ్ ప్రకటించిన నూతన నిబంధనలు అమలు చేయాలంటే టెలికాం కంపెనీలపై వందల కోట్ల రూపాయల భారం పడుతుందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కాయ్) ఆందోళన వ్యక్తం చేసింది.

200-400 కోట్ల రూపాయల అవసరం..
టెలికాం సంస్థల వ్యవస్థలను మార్చడానికి, బ్లాక్చెయిన్ టెక్నాలజీని వినియోగించడానికి కనీసం 200-400 కోట్ల రూపాయల అవసరం ఉంటుందని కాయ్ తెలిపింది.

18 నెలల గడువు అవసరం..
అంతేకాకుండా ట్రాయ్ నూతన నిబంధనలను అమలు చేయడానికి 18 నెలల గడువు అవసరం ఉంటుందని పేర్కొంది.

ట్రాయ్ సూచించిన వ్యవస్థను..
ట్రాయ్ సూచించిన వ్యవస్థను ప్రపంచంలో ఎక్కడా అమలు చేయలేదని, దీని అమలుకు భారీ ఎత్తున పెట్టుబడులు, సమయం పడుతుందని కాయ్ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ తెలిపారు.

కనీసం 1-1.5 ఏళ్ల సమయం..
డిసెంబరు వరకు కొత్త నిబంధనలను అమలు చేయాలని ట్రాయ్ ఆదేశాలు జారీ చేసిందని, ఇది ఎంత మాత్రం సాధ్యం కాదని ఆయన అన్నారు. టెలికాం సంస్థలు తమ వ్యవస్థల్లో మార్పులు చేర్పులు చేసేందుకు కనీసం 1-1.5 ఏళ్ల సమయం పడుతుందని చెప్పారు.

వ్యయాలు
కాగా టెలికాం సంస్థలు భరించే వ్యయాలు కస్టమర్లపైన మోపేందుకు అవకాశం కూడా ఉంటుందని, అయితే ఎంత భారం వేయాలన్నది మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని మాథ్యూస్ అన్నారు.

కోట్లాది రూపాయల అప్పుల భారంతో ..
టెలికాం సంస్థలు ఇప్పటికే కోట్లాది రూపాయల అప్పుల భారంతో నెట్టుకువస్తున్నాయని, ట్రాయ్ కొత్త నిబంధనల వల్ల మూలిగేనక్కపై తాటి పండు పడిన చందంగా మారుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications








