రాబడే టార్గెట్, టారిఫ్ ధరలు భారీగా పెరిగే అవకాశం
దేశీయ టెలికాం రంగంలో మున్ముందు చార్జీలు మరింత పెరగనున్నాయని వార్తలు వస్తున్నాయి. జెఫ్రీస్ అనే అంతర్జాతీయ సేవల సంస్థ తాజా నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. భారత టెలికాం కంపెనీల ఆదాయం/ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆర్జన (ఏఆర్పీయూ) 2020-25 ఆర్థిక సంవత్సరాల్లో రెట్టింపు కావచ్చని రిపోర్టు అంచనా వేసింది. 2024-25 నాటికి మొబైల్ సేవల ఆదాయం 3,800 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చంటోంది. ఇది మన కరెన్సీలో రూ.2.85 లక్షల కోట్లతో సమానం. ప్రస్తుతం దేశీయ టెలికాం రంగంలో కొనసాగుతున్న ఏకీకరణ ప్రక్రియ, చార్జీల పెంపుతో అత్యధికంగా లబ్ధి పొందనున్న కంపెనీ భారతీ ఎయిర్టెల్ అని జెఫ్రీస్ పేర్కొంది.

భారతీ ఎయిర్టెల్
ప్రస్తుతం భారత మొబైల్ సేవల ఆదాయం-జీడీపీ నిష్పత్తి 0.7 శాతంగా ఉంది. పలు వర్ధమాన దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువని నివేదిక పేర్కొంది. కంపెనీలిప్పుడు చార్జీల విషయంలో ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట వేస్తుండటంతో రాబడి ఏటా 3-5 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉందని జెఫ్రీస్ అంచనా వేసింది.

ఆర్థికంగా ఒత్తిడి
రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో మొబైల్ కాలింగ్, డేటా సేవలు అంత్యంత చౌకగా మారాయి. జియోకు పోటీగా ఇతర టెలికాం కంపెనీలూ చార్జీలను భారీగా తగ్గించాల్సి వచ్చింది. తత్ఫలితంగా టెలికాం రంగంపై ఆర్థికంగా ఒత్తిడి పెరిగి, విలీనాలకు దారితీసింది. ఇప్పుడిక పోటీ మూడు ప్రైవేట్ కంపెనీల మధ్యనే. అయితే, సుప్రీంకోర్టు తీర్పుతో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాపై ఏజీఆర్ (సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం) బకాయిలపై ప్రభావం పడింది. దాంతో ఈ రెండు కంపెనీలపై ఆర్థిక ఒత్తిడి మరింత పెరిగింది.

మూడేళ్లలోనే నెం.1 టెలికాం
వ్యాపార మనుగడ కోసం ఆదాయం పెంచుకోవడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపేమో, రిలయన్స్ జియో సేవలు ప్రారంభించిన మూడేళ్లలోనే నెం.1 టెలికాం కంపెనీగా ఎదిగింది. ఈ ఏడాది జనవరి నాటికి కంపెనీ మార్కెట్ వాటా 32 శాతానికి పైగా పెరిగింది.

చార్జీలు పెరిగినప్పటికీ,
కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీకిక కారు చౌక సేవల అవసరం లేకుండా పోయింది. ఈ పరిణామం టెలికాం రంగంలో ధరల యుద్ధానికి తెరదించిందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. గత ఏడాది డిసెంబరులో మొబైల్ టారిఫ్లు గణనీయంగా పెరిగాయి. చార్జీలు పెరిగినప్పటికీ, ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఎయిర్టెల్, జియో మొబైల్ వినియోగదారులు మరో 2.4 కోట్ల మంది పెరిగారు. దీన్నిబట్టి చూస్తే, చార్జీల పెంపునకు మార్కెట్ ఆమోదం లభించినట్లేనని జెఫ్రీస్ రిపోర్టు పేర్కొంది.


Click it and Unblock the Notifications